వికేంద్రీకరణతో రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి: ఫ్యాప్సీ
హైదరాబాద్: మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) అనే రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఫ్యాప్సీ అభిప్రాయపడింది. తెలంగాణ, సీమాంధ్రలోని మౌలిక వసతులు, మానవ వనరులను సరైన మార్గంలో ఉపయోగించుకుంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడడంతోపాటు మంచి విజన్ ఉంటేనే సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ఓ నిర్దిష్ట రోడ్మ్యాప్ను ఫ్యాప్సీ రూపొందించింది. దీన్ని బుధవారం హైదరాబాద్లోని ఫ్యాప్సీ కార్యాలయంలో సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ అయ్యదేవర, సీనియర్ ఉపాధ్యక్షుడు ఆర్ శివ కుమార్, ఉపాధ్యక్షుడు అనిల్రెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫ్యాప్సీ అధ్యక్షుడు శ్రీనివాస్ అయ్యదేవర మాట్లాడుతూ.. వనరులు, మౌలిక వసతులు, అవకాశాలు కల్పిస్తే పెట్టుబడులు వాటంతటవే వస్తాయని తెలిపారు.
సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడడంతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు లేకుండా చేసి పెట్టుబడిదారులకు మంచి వాతావరణం కల్పిస్తే పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ చేస్తే సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని నుంచి అన్ని ప్రాంతాల్లోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు రోడ్డు అనుసంధానం చేయడం ముఖ్యమైన అంశమని తెలిపారు.
రాజధానితో సమానంగా ద్వితీయ శ్రేణి పట్టణాలు అభివృద్ధి చెందాలని, ఇందుకు ఆయా ప్రాంతాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రాల్లోకి ప్రైవేటు, పబ్లిక్, విదేశీ పెట్టుబడులు వచ్చినప్పుడు అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యుత్ సమస్యల మీద ఎక్కువ దృష్టిసారించాలని, విద్యుత్ లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. భూమిని, మానవ వనరుల్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
రాష్ట్రంలో 65 నుంచి 70 శాతం వరకు ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారని గుర్తుచేశారు. కనుక భూమిని రియల్ ఎస్టేట్ రంగానికే ఉపయోగించకుండా ప్రాంతాలను బట్టి వ్యవసాయ రంగాన్నీ అభివృద్ధి చేయడం ముఖ్యమని ఆయన సూచించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ఫ్యాప్సీ రూపొందించిన రోడ్మ్యాప్ను అన్ని రాజకీయ పార్టీలకు అందజేస్తామని చెప్పారు. త్వరలోనే కారిడార్ల వారీగా రోడ్మ్యాప్లను తయారు చేస్తామని తెలిపారు. కాగా, రాష్ట్రం విడిపోయినందున ఇక నుంచి ఫ్యాప్సీ పురస్కారాలను రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అందజేయనున్నట్లు చెప్పారు. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటైన తర్వాత అక్కడ కూడా ఫ్యాప్సీ ప్రాంతీయ కార్యాలయాన్ని నెలకొల్పే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు.