ఎన్నారైలను సొంతవారిగా చూడండి: స్వరాజ్ పాల్
గడిచిన ఆరు నెలల్లో డిపాజిట్ల ద్వారా భారత్లోకి దాదాపు 65 బిలియన్ డాలర్లను ఎన్ఆర్ఐలు పంపించారన్నారు. అయినప్పటికీ దేశాభివృద్ధికి ఎన్ఆర్ఐలు చేస్తున్న కృషిని ప్రభుత్వం మరిచిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రమాదకర స్థాయిలో నిరర్థక ఆస్తులు (ఎన్పిఎ) పేరుకుపోయిన క్రమంలో ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) పిలుపుతో ఎన్ఆర్ఐలు భారత్లోకి భారీగా నిధులను తరలిస్తున్నారని గుర్తుచేశారు.
1990 దశకంలో భారత ఆర్థిక విధానాలు సరళీకృతం చేసి విదేశీ పెట్టుబడులకు ఆర్థిక రంగాన్ని తెరిచినప్పుడు కూడా ఎన్ఆర్ఐలే దన్నుగా నిలిచారన్న సంగతి ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ఎన్ఆర్ఐలు కూడా భారత్లో భాగమేనన్న సత్యాన్ని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్లోని ప్రతి ఒక్కరు తాము భారతీయులమని గర్వపడాలని స్వరాజ్ పాల్ అన్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై స్పందిస్తూ భారతీయ ఓటర్లు లంచాలకు ప్రభావితం కాబోరన్నారు.
‘భారత్లోని పత్రికలైనా, ఐరోపా లేదా ప్రపంచంలోని ఏ దేశ మీడియా అయినా భారతీయ ఓటర్లు లంచాలు తీసుకుంటున్నారని అంటున్నాయి. ఇదంతా అబద్ధం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరికి ఓటేయాలనుకుంటారో వారికే ఓటేస్తారు. నా దృష్టిలో భారత్లో అసలైన విజేతలు ఓటర్లు మాత్రమే.' అని స్వరాజ్ పాల్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అన్న ఆయన, రాజకీయ పార్టీలు పేదరికం, విద్య వంటి వాస్తవిక అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.