ఇన్ఫోసిస్, టిసిఎస్ బాటలోనే విప్రో: 28శాతం వృద్ధి
బెంగళూరు: దేశీయ ఐటి దిగ్గజాల్లో ఒకటైన విప్రో టెక్నాలజీస్ కూడా మెరుగైన ఫలితాలు సాధించిన ఇన్ఫోసిస్, టిసిఎస్ బాటలోనే నడిచింది. విప్రో 2014 మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 2,226.5 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం 1,728.70 కోట్ల రూపాయలతో పోల్చితే ఇది 28.8 శాతం వృద్ధి సాధించింది. అమెరికాలో అద్భుతమైన వృద్ధి చోటు చేసుకోవడంతోపాటు యూరప్లో కూడా డిమాండు పెరగడం, ఉత్పత్తులపై చేసిన వ్యయాలు అధిక మొత్తంలో రాబట్టుకోగలగడం ఈ వృద్ధికి దోహదపడిందని విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ పేర్కొన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా కోలుకుంటూ ఉండడంతో సరికొత్త సాంకేతిక అన్వేషణలకు అవకాశం పెరిగిందని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పోటీదారులను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన సరికొత్త సొల్యూషన్లను కస్టమర్లకు అందించేందుకు గట్టి కృషి చేయాల్సివచ్చిందని ఆయన తెలిపారు. మార్చి 31వ తేదీతోనే ముగిసిన ఏడాది కాలంలో తాము 43,754.90 కోట్ల రూపాయల ఆదాయంపై 7,796.70 కోట్ల రూపాయల నికరలాభం ఆర్జించామని ప్రేమ్జీ పేర్కొన్నారు.
ఐటి సర్వీసుల రంగం ఈ ఆదాయంలో 39,950 కోట్ల రూపాయల ఆదాయం అందించినట్టు ఆయన తెలిపారు. ఏడాది మొత్తం మీద ఆదాయం 16.1 శాతం, లాభం 17.5 శాతం పెరిగాయని ఆయన చెప్పారు. కాగా, నాలుగో త్రైమాసికంలో విప్రో నికర అమ్మకాలు 21.7 శాతం పెరిగి 9,613.10 కోట్ల నుంచి 11,703.60 కోట్ల రూపాయలకు చేరాయి. ఐటి సర్వీసుల విభాగం ద్వారా 10,620 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే ఇది 24 శాతం అధికం. డాలర్ మారకంలో ఈ విభాగం ఆదాయం 8.5 శాతం పెరిగి 172 కోట్ల డాలర్లకు చేరింది.
ఇది కూడా ఆ త్రైమాసికానికి విప్రో ప్రకటించిన ముందస్తు అంచనాకు (171.2 కోట్ల డాలర్ల నుంచి 174.5 కోట్ల డాలర్ల మధ్య) దీటుగానే ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఐటి సర్వీసుల విభాగం ద్వారా 171.5 కోట్ల డాలర్ల నుంచి 175.5 కోట్ల డాలర్ల మధ్యలో ఆదాయం ఆర్జించే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ఐటి ఉత్పత్తుల విభాగం ద్వారా నాలుగో త్రైమాసికంలో 1110 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
గత ఏడాదితో పోల్చితే ఇది మూడు శాతం అధికం. ఏడాది మొత్తం మీద ఐటి ఉత్పత్తుల ఆదాయం ఒక శాతం తగ్గి 3880 కోట్లకు పరిమితమయింది. విప్రో డైరెక్టర్ల బోర్డు 2013-14 ఆర్థిక సంవత్సరానికి షేర్హోల్డర్లకు ఐదు రూపాయల తుది డివిడెండును ప్రకటించింది. దీంతో ఒక్కో షేరుపై ఏడాది మొత్తం మీద చెల్లించిన డివిడెండు ఎనిమిది రూపాయలయింది. విప్రో షేరు బిఎస్ఈలో గురువారం 2.39 శాతం పెరిగి 585.55 రూపాయల వద్ద క్లోజయింది. మార్కెట్ ముగిసిన అనంతరం విప్రో ఆర్థిక ఫలితాలు ప్రకటించింది.
ఇది ఇలా ఉండగా ఐటి సర్వీసుల రంగంలో నాలుగో స్థానంలో ఉన్న హెచ్సిఎల్ టెక్నాలజీస్ మార్చి 31వ తేదీతో ముగిసిన మూడో త్రైమాసికంలో 59 శాతం వృద్ధితో 1,624 కోట్ల రూపాయల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం 1,021 కోట్ల రూపాయలు. జూలై-జూన్ ఆర్థిక సంవత్సరాన్ని పాటించే హెచ్సిఎల్ టెక్ మూడో త్రైమాసికం ఆదాయం 8,349 కోట్ల రూపాయలు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన మొత్తం వ్యా పారం 6,430 కోట్లతో పోల్చితే ఇది 29.8 శాతం అధికంగా ఉంది.