2005కి ముందు నోట్ల ఉపసంహరణ ఎందుకు?
భారత రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) ఇటీవల ఓ తాజా నిర్ణయం తీసుకుంది. 2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను వెనక్కి(ఉపసంహరణ) తీసుకోవాలని నిర్ణయించింది. ప్రజలు తమ వద్ద ఉన్న 2005కు ముందు ముద్రించిన నోట్లను ఏప్రిల్ 1, 2014 నుంచి మార్చుకోవాలని కోరింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమ వద్ద ఉన్న ఆ నోట్లను మార్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
2015, జనవరి 1 వరకు ఈ నోట్లను ఏ బ్యాంకులోనైనా ఉచితంగా మార్చుకోవచ్చని రిజర్వు బ్యాంకు తెలిపింది. 2015, జనవరి 1 తర్వాత నోట్లను మార్చుకోవాలనుకుంటే ఆ వివరాలను రిజర్వు బ్యాంకుకు తెలపాల్సి ఉంటుంది. అందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ నోట్లను వెనక్కి తీసుకోవాలని ఆర్బిఐ ఎందుకు నిర్ణయించింది?
భారత రిజర్వు బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. కొన్ని భద్రతా పరమైన కారణాల వల్ల 2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను వెనక్కి తీసుకోవడం జరుగుతోంది. 2005 తర్వాత ముద్రించిన నోట్లతో పోల్చితే ఆ(2005కు ముందు) నోట్లకు భద్రతాపరమైన తేడాలున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరెన్సీ నోట్లును తీసుకురావడంలో భాగంగానే 2005కు ముందున్న నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 2005కు ముద్రించిన నోట్లు కూడా చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయని బ్యాంకు తెలిపింది. అంతేగాక బ్యాంకులు కూడా 2005కు ముందు ముద్రితమైన నోట్లను ఏటిఎంల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా జారీ చేయకూడదని ఆదేశించింది.