అదరగొట్టిన టిసిఎస్ లాభాలు: 48.2 శాతం వృద్ధి
ముంబై: దేశీయ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టిసిఎస్) ఏకీకృత నికర లాభాలు ఈ జనవరి- మార్చి త్రైమాసికంలో 48.2 శాతం వృద్ధి చెందాయి. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 5,358 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. గత ఏడాది జనవరి-మార్చిలో సంస్థ లాభాలు 3,615.64 కోట్ల రూపాయలుగానే ఉన్నాయి. అయితే గత సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే మాత్రం జనవరి-మార్చిలో లాభాల్లో స్వల్ప వృద్ధినే టిసిఎస్ అందుకోగలిగింది. నాడు 5,333.43 కోట్ల రూపాయల లాభాలను పొందింది.
కాగా, ఐరోపా, ఎపిఎసి మార్కెట్లలో చోటుచేసుకున్న వృద్ధి, డిజిటల్ టెక్నాలజీస్లో పెట్టుబడులు తాజా లాభాలకు దోహదం చేశాయి. ఇక జనవరి-మార్చి ఏకీకృత ఆదాయం 31.2 శాతం పెరిగి 21,551.09 కోట్ల రూపాయలకు చేరింది. అంతకుముందు ఇది 16,430.09 కోట్ల రూపాయలుగా ఉంది. ‘ఈ ఫలితాలతో మార్కెట్లో మా పోటీతత్వ స్థాయిని బలోపేతం చేసుకోవడమేగాక, పటిష్టమైన వృద్ధిని చూపించాం.' అని టిసిఎస్ సిఈఓ ఎన్ చంద్రశేఖరన్ బుధవారం ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా తెలిపారు. అంతేగాక గడిచిన ఏడాదిలో ఐరోపాలో నూతన మార్కెట్లకు విస్తరించగలిగామని, కస్టమర్లతో వ్యాపార సంబంధాలను పెంచుకున్నామని చెప్పారు.
ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 37.69 శాతం పెరిగాయి. 2013-14లో 19,163.8 కోట్ల రూపాయల లాభాలను సాధించింది. ఆదాయం కూడా 29.87 శాతం పుంజుకుని 81,809 కోట్ల రూపాయలను తాకింది. ఇదిలావుంటే అమెరికా డాలర్లలో సంస్థ ఆదాయం 13.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నికర లాభం 3.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
అలాగే జనవరి-మార్చిలో కొత్తగా 9,751 మంది ఉద్యోగులను తీసుకోగా, మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో 24,268 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఫలితంగా సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,00,464కు చేరింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15లో 55,000 ఉద్యోగులను తీసుకోనున్నట్లు టిసిఎస్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు, సంస్థ గ్లోబల్ మానవ వనరుల అధిపతి అజయ్ ముఖర్జీ విలేఖరులకు తెలిపారు. అనుభవజ్ఞులతోపాటు 25,000 మంది కొత్తవారి నియామకాలు ఇందులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, మంగళవారం ఇన్ఫోసిస్ కూడా మెరుగైన ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే.