అంచనాలు మించిన ఇన్ఫోసిస్: 25శాతం వృద్ధి
బెంగళూరు: భారత ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ అంచనాలకు మించి ఫలితాలు ప్రకటించి శుభారంభం చేసింది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తాము చేజిక్కించుకున్న పెద్ద ఒప్పందాలు, ఐటిపై ఖాతాదారుల వ్యయాల పెంపు తమ ఆదాయాల వృద్ధికి దోహదపడ్డాయని ఇన్ఫోసిస్ తెలిపింది. 2014 మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో 25 శాతం వృద్ధిని నమోదు చేసింది.
మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 12,875 కోట్ల రూపాయల ఆదాయంపై 2,992 కోట్ల రూపాయల నికరలాభం ఆర్జించింది. 2012-13 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10,454 కోట్లు కాగా నికరలాభం 2,394 కోట్ల రూపాయలు. ఆదాయంలో 23.2 శాతం, నికరలాభంలో 25 శాతం వృద్ధి నమోదైనట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. మూడో త్రైమాసికం ఆదాయం 13,026 కోట్ల రూపాయలతో పోల్చితే నాలుగో త్రైమాసికం ఆదాయం 1.2 శాతం తగ్గింది. నికరలాభం మాత్రం ఇంతకు ముందు సాధించిన 2,875 కోట్లతో పోల్చితే 4.1 శాతం పెరిగింది.
2012-13 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 24.2 శాతం పెరిగి 50,133 కోట్ల రూపాయలకు చేరగా.. నికరలాభం 13 శాతం పెరిగి 10,648 కోట్ల రూపాయలకు చేరింది. జనవరి-మార్చి త్రైమాసికంలో డాలర్ల రూపంలో సమకూరిన నికరలాభం 9.7 శాతం పెరిగి 48.7 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఆదాయం 7.9 శాతం వృద్ధితో 209 కోట్ల డాలర్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి డాలర్ ఆదాయం 11.5 శాతం పెరిగి 820 కోట్లకు చేరగా నికర లాభం 1.5 శాతం పెరిగి 175 కోట్లకు చేరింది.
ఆదాయాల్లో ఉత్తర అమెరికా వాటా 59.8 శాతం, యూరోపియన్ దేశాల వాటా 25.2 శాతం, భారత్ వాటా 2.6 శాతం ఉన్నాయి. నాలుగో త్రైమాసికంలో 10,997 మందిని, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 39,985 మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,60,405కి చేరింది. నాలుగో త్రైమాసికంలో 50 మంది, ఏడాది మొత్తం మీద 238 మంది క్లయింట్లను సమకూర్చుకుంది. నగదు, నగదుగా మార్చుకోగల నిల్వలన్నీ కలిసి 30,251 కోట్లున్నాయి.
దృఢంగా ఉంది: శిబులాల్
ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శిబులాల్ మాట్లాడుతూ.. తాము అత్యంత నిరుత్సాహపూరితమైన క్యు4, క్యు3ల నుంచి వెలుపలికి వచ్చామని అన్నారు. ఈ రెండు త్రైమాసికాల్లోను తాము ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు ముందు త్రైమాసికాల్లో కూడా కొనసాగుతాయని ఇంతకు ముందే చెప్పామని, వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే తాము 7-9 శాతం వృద్ధి అంచనా ప్రకటించామని ఆయన తెలిపారు. అయితే ఇంతకు ముందు ఏడాదితో పోల్చితే మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తాము రెండంకెల వృద్ధిరేటును సాధించగలిగామని చెప్పారు. ప్రస్తుతం తమ కంపెనీ దృఢంగా ఉందని తెలిపారు. తన తదుపరి ఇన్ఫోసిస్ పగ్గాలు చేపట్టే వారికి బలమైన కంపెనీని అందించాలనేది తన కోరిక అని చెప్పారు. ఆయన వచ్చే జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు.
డివిడెండ్ జోష్
గత ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్పై రూ. 43 తుది డివిడెండ్ చెల్లించాలని ఇన్ఫోసిస్ బోర్డ్ నిర్ణయించింది. 2013-14 నుంచి అమలులోకి వచ్చే విధంగా నికర లాభంలో డివిడెండ్ నిష్పత్తిని 40 శాతం వరకూ పెంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఇది 30 శాతం మాత్రమే ఉంది.
కాగా, కొత్త సంవత్సరంలో ఆదాయాల వృద్ధి నాస్కామ్ అంచనాల కన్నా తక్కువగా ఉండడంతో ఇన్ఫోసిస్ షేరు ధర 0.76 శాతం వృద్ధితోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. బిఎస్ఇలో ఇంట్రాడేలో 4.2 శాతం వృద్ధితో 3371.80 రూపాయలకు చేరిన షేరు చివరికి ఆ లాభాలను పోగొట్టుకుని 3260.45 రూపాయల వద్ద క్లోజైంది. ఎన్ఎస్ఇలో ఈ షేరు 1.02 శాతం వృద్ధితో 3268.15 రూపాయల వద్ద ముగిసింది.