అంచనాలను మించిన ఆర్ఐఎల్, విప్రో
ఈ అంచనాలు మంచి రూ. 5,511 కోట్ల నికర లాభం నమోదైంది. కాగా ద్వితీయ త్రైమాసికం (5,490 కోట్ల రూపాయలు)తో పోల్చితే లాభాలు పెరిగాయని కంపెనీ పేర్కొంది. కేజీ బేసిన్లో సహజ వాయువు ఉత్పత్తి కనిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ అమ్మకాలు 10.5 శాతం వృద్ధి చెంది 1,06,383 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని ఆర్ఐఎల్ వెల్లడించింది. అయితే రిఫైనింగ్ మార్జిన్లు మాత్రం పడిపోగా ఇతర వ్యాపారాల రాబడులు మాత్రం 32 శాతం పెరిగి 1,740 కోట్ల రూపాయల నుంచి 2,305 కోట్ల రూపాయలకు వృద్ధి చెందాయని ఆర్ఐఎల్ తెలిపింది.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఒక్కో పీపా ముడి చమురుపై రిఫైనింగ్ మార్జిన్ 7.6 డాలర్లకు తగ్గిందని పేర్కొంది. కాగా ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 9.6 డాలర్లుగా ఉంది. జామ్నగర్లోని ఒక ప్లాంట్ను మెయింటెనెన్స్ నిమిత్తం మూసివేయటంతో రిఫైనింగ్ వ్యాపారం 13.1 శాతం క్షీణించినప్పటికీ ఎబిటా మాత్రం సింగపూర్ సగటు కంటే మెరుగ్గా ఉందని తెలిపింది.
ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కంపెనీపై రుణ భారం రూ. 72,427 కోట్లు ఉంటే.. డిసెంబర్ చివరి నాటికి అది రూ. 81, 330 కోట్లకు పెరిగింది. కాగా సమీక్ష త్రైమాసికంలో రిటైల్ వ్యాపారంలో స్థూల లాభం (తరుగుదల, పన్నులు, వడ్డీ చెల్లింపులకు ముందు లాభం) రూ. 106 కోట్లుగా ఉందని ఆర్ఐఎల్ సిఎండి ముకేష్ అంబానీ అన్నారు. రిటైల్ వ్యాపారంలో ఆకర్షణీయ వృద్ధిరేటు కొనసాగుతోంది.
లాభాలను 27శాతం పెంచుకున్న విప్రో
బెంగళూరు: దేశీయ ఐటిరంగ సంస్థల్లో మూడో స్థానంలో కొనసాగుతున్న విప్రో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభాలను 27 శాతం పెంచుకుంది. డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 2,010 కోట్ల రూపాయల నికర లాభాలను అందుకుంది. మౌలిక సదుపాయాల సేవల వ్యాపారంలో వృద్ధి, సామర్థ్యాలు మెరుగుపడటం, ఐటిపై ఖాతాదారులు ఖర్చు పెంచడం లాభం పెరగడానికి దోహదం చేశాయని విప్రో వెల్లడించింది.
కాగా ఏడాది క్రితం ఇదే సమయంలో 1,589 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవల్లో బలమైన వృద్ధి వంటివి లాభాలు పెరిగేందుకు దోహదం చేసినట్లు సంస్థ శుక్రవారం తెలియజేసింది. అంతకుముందు 9,589 కోట్ల రూపాయలుగా ఉంది. సంస్థ ప్రదర్శనపై విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిలకడగా పురోగమిస్తోందని తెలిపారు. వినియోగదారుల నుంచి తాము ఆశాజనకమైన వ్యాపారాన్ని అందుకున్నామని చెప్పారు. ముఖ్యంగా పశ్చిమ దేశాల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు.
ఇక డాలర్లలో విప్రో ఐటి ఆదాయం 1.67 బిలియన్ డాలర్లు (10,330 కోట్ల రూపాయలు)గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 6.4 శాతం అధికం. ఈ త్రైమాసికంలో గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ వ్యాపారం నుంచి మంచి ఆదాయాన్ని అందుకున్నామని విప్రో సిఇఓ టికె కురియన్ తెలిపారు. నాలుగో త్రైమాసికంలో 1.71-1.75 బిలియన్ డాలర్ల రెవిన్యూను అందుకుంటామనే ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు.
మూడో త్రైమాసికంలో 42 మంది కొత్త కస్టమర్లను అందుకున్న విప్రో.. ఐటి సర్వీసుల విభాగంలో డిసెంబర్ 31 నాటికి 1,46,402 మంది ఉద్యోగులను కలిగి ఉంది. మధ్యంతర డివిడెండ్ 3 శాతంగా విప్రో బోర్డు నిర్ణయించింది. కాగా బిఎస్ఈలో శుక్రవారం విప్రో షేర్ ధర 3.15 శాతం తగ్గి రూ. 552.45 వద్ద ముగిసింది.