కొనసాగని లాభాలు: స్పెక్ట్రమ్ ధర పెంపు
కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన పథకాల కొనసాగింపుపై అనుమానాలు.. క్షీణించిన విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐ) కొనుగోళ్ల మధ్య స్టాక్మార్కెట్లు మూడోరోజూ నష్టాలపాలయ్యాయి. బిఎస్ఈ సూచీ సెన్సెక్స్ 11.66 పాయింట్లు పడిపోయి 20,217.39 పాయింట్ల వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 3.6 పాయింట్లు దిగజారి 5,995.45 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. మధ్యాహ్న సమయంలో సెనె్సక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లపైన కదలాడగా, ముగింపు సమయం సమీపిస్తున్నకొద్దీ మదుపర్లు అమ్మకాలకు దిగడంతో లాభాలు క్షీణించాయి. మొత్తం మూడు సెషన్లలో సెన్సెక్స్ 673 పాయింట్లు కోల్పోయి నవంబర్ 13 నాటి కనిష్ట స్థాయికి పడిపోయింది.
స్పెక్ట్రమ్ ధర పెంపు: రెట్టింపు అపరాధ రుసుము
మొబైల్ ఫోన్ సర్వీసులకు వినియోగించే స్పెక్ట్రమ్ వేలం రిజర్వు ధరను 25 శాతం వరకు పెంచేందుకు ఉన్నత స్థాయి మంత్రుల బృందం ఆమోదముద్ర వేసింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో వేలం ప్రక్రియను చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోని సారధ్యంలో సాధికార మంత్రుల బృందం (ఇజిఒఎం) శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా టెలికాం కమిషన్ సూచించిన మేరకు 1800 మెగాహెట్జ్, 900మెగా హెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కనీస ధరలకు అంగీకారం తెలిపారు.
కాగా సెల్ఫోన్ టవర్ల రేడియేషన్ స్థాయికి సంబంధించి విధించిన నిబంధనల ఉల్లంఘనపై ప్రస్తుతం ఉన్న జరిమానాను టెలికాం శాఖ రెట్టింపు(రూ. 10లక్షలు) చేసింది. రేడియేషన్ నిబంధనలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనకైనా ఇప్పటిదాకా గరిష్ఠంగా ఐదు లక్షల రూపాయలను జరిమానాగా విధించిన టెలికాం శాఖ.. ఇప్పుడు ఆ జరిమానాను 10 లక్షల రూపాయలకు పెంచింది. అయితే ఇదే సమయంలో నిబంధనలపై సెల్ఫ్-సర్టిఫైడ్ డాక్యుమెంట్ల సమర్పణలో జరిగే ఆలస్యంపై విధిస్తున్న జరిమానాను టెలికాం శాఖ భారీగా తగ్గించింది. సవరించిన జరిమానాల విధానం ప్రకారం గరిష్ఠంగా 50,000 రూపాయలను నిర్ణయించింది.