రూ.4,700 కోట్లతో రామగుండం ప్లాంటు పునరుద్ధరణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూసివేయబడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం యూరియా కర్మాగార పునరుద్ధరణకు కన్సార్టియం ఏర్పాటు చేసే అంశంపై నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (ఎఫ్ సిఐఎల్) చర్చిస్తున్నాయి. ఈ మేరకు ఎన్ఎఫ్ఎల్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
రామగుండం ప్లాంటు పునర్నిర్మాణానికి సుమారు రూ.4,700 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిపాదిత స్పెషల్ పర్సన్ వెహికిల్(ఎస్ పివి)లో ఎస్ఎఫ్ఎల్, ఐఈఎల్లు చెరి 26శాతం, ఎఫ్సిఐఎల్కు 11శాతం వాటా ఉండే అవకాశం ఉంది. వ్యూహాత్మక భాగస్వామికి మిగిలిన వాటా కేటాయించే అవకాశం ఉంది.
స్పెషల్ పర్సన్ వెహికిల్ భాగస్వామ్య సంస్థలు పెట్టుబడిలో మూడింట ఒక వంతు ఈక్విటీ మూలధనం రూపంలో సమకూర్చుతాయి. మిగిలిన మొత్తాన్ని రుణంగా సేకరిస్తామని అధికారులు తెలిపారు. సహజ వాయువు ఆధారంగా పనిచేయనున్న రామగుండం కర్మాగారం ఏడాదికి 12.70లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. రాష్ట్రంలోని రామగుండం ప్లాంటు సహా ఎఫ్సిఐఎల్కు చెందిన ఐదు కర్మాగారాలు 2002లో మూసివేతకు లోనైన విషయం తెలిసిందె.