మరో 3 నెలలు పాటు పాత చెక్కులను ఉపయోగించుకోవచ్చు: ఆర్బీఐ
చెక్ ట్రంకేషన్ సిస్టం(సీటీఎస్) 2010 ప్రమాణాలకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా ఒకే రకమైన రూపురేఖలున్న చెక్కులను జారీ చేయాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. భద్రతాపరంగా మెరుగైన ఫీచర్స్ ఉన్న ఇటువంటి చెక్కులతో మోసాలను అరికట్టేందుకు వీలవుతుందని తెలిపింది. ఈ విధానానికి మారే క్రమంలో బ్యాంకులు ముందుగా మల్టీ-సిటీ లేదా ఎట్ పార్ చెక్కులను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ సూచించింది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న నాన్- సీటీఎస్ 2010 చెక్కులను ఈ ఏడాది డిసెంబర్లోగా ఉపసంహరించాలని పేర్కొంది. దీనిపై ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఎస్ అలెర్ట్లు, ఉత్తరాలు పంపడంతో పాటు బ్రాంచీలు, ఏటీఎంలలో నోటీసులు ఉంచాలని ఆర్బీఐ సూచించింది. చెక్ క్లియరింగ్లో అనేక కొత్త పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజా ప్రమాణాలతో కూడిన చెక్కులను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.
చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటే ఏమిటీ:
చెక్కు సంబంధించిన లావాదేవీలను ఫిజికల్ మూమెంట్ ప్రాతిపదికన కాకుండా కేవలం ఎలక్ట్రానిక్ రూపంలో జరిగేలా వీలు కల్పిస్తున్నారు. ఈ విధానాన్నే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చెక్ లావాదేవీల్లో ఎటువంటి మోసాలు జరగకుండా చూడడం, అలాగే అన్లైన్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్డ్ ప్రాతిపదికన చెక్కులు వెంటనే క్లియరెన్స్ ఈ విధానం ప్రధాన ఉద్దేశం. 2012 డిసెంబర్ 31 తర్వాత ప్రస్తుత చెక్కలను నిలుపుచేయాలని ఈ నెల మొదట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన విషయం తెలిసిందే. త్వరలో ఇతర బ్యాంక్లు కూడా ఈ విధానాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
తెలుగు వన్ఇండియా