ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్: 10 సులువైన సూచనలు
మీ పన్ను సంక్రమిత ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్నా రిటర్నులు సమర్పించవచ్చు. భవిష్యత్తు ఆర్థిక లావాదేవీల్లో ఇది మీకు పనికొస్తుంది. టీడీఎస్ రిటర్నుల కోసం సైతం ఐటీ రిటర్నులు ఉపయోగపడతాయి.
2016-17 ఆర్థిక సంవత్సరం(2017-18 మదింపు సంవత్సరం) కోసం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 31. మీకు సంవత్సరంలో పన్ను సంక్రమించే ఆదాయం రూ.2,50,000 పైన ఉంటే ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను కట్టి, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలని పన్ను నిపుణులు చెబుతున్నారు. మీ పన్ను సంక్రమిత ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్నా రిటర్నులు సమర్పించవచ్చు. భవిష్యత్తు ఆర్థిక లావాదేవీల్లో ఇది మీకు పనికొస్తుంది. టీడీఎస్ రిటర్నుల కోసం సైతం ఐటీ రిటర్నులు ఉపయోగపడతాయి. సమయం లోపు రిటర్నులు సమర్పించకపోతే తర్వాత ఇబ్బందులు పడతారు. దీని కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
1.ఫారం 16
మీ యాజమాన్యం(హెచ్ ఆర్, ఫైనాన్స్) నుంచి ఫారం 16ను అందుకోండి. అందులో మీ వేతన వివరాలు, టీడీఎస్ మినహాయింపులు వంటివి ఉంటాయి. ఒక వేళ ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు రెండు చోట్ల పని చేసి ఉంటే రెండు చోట్ల నుంచి ఫారం 16ను తీసుకోవాల్సి ఉంటుంది.
2. ఆధార్, పాన్ అనుసంధానం
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు ప్రభుత్వం ఆధార్ తప్పనిసరి చేసింది. దీన్ని మీరు ఆదాయపు పన్ను వెబ్సైట్లో లింక్ ద్వారా పూర్తిచేయవచ్చు
పాన్ కార్డుతో ఆధార్ సంఖ్యను అనుసంధానించడం ఎలా?
3. అన్ని డాక్యుమెంట్లు సిద్దంగా ఉంచుకోవాలి?
బ్యాంకు స్టేట్మెంట్లు, పెట్టుబడి వివరాలు, ఇతర ఆదాయాలు, బీమా పాలసీ, పీపీఎఫ్ స్టేట్మెంట్, ఎన్పీఎస్ వివరాలు, స్టాంప్ డ్యూటీ వంటివన్నీ ఒకే చోట సిద్దంగా ఉంచుకోవాలి. ఒకసారి ట్యాక్స్ రిటర్నులు చేసేందుకు సిద్దమైతే చాలా వివరాలు అవసరం అవుతాయి. అవన్నీ దగ్గర ఉంచుకుని పన్ను రిటర్నుల ప్రక్రియను మొదలుపెట్టాలి.
4. మూలధన రాబడులు
నిర్ణీత కాలపరిమితి లోపు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను అమ్మేసినట్లయితే మూలధన రాబడి పన్ను ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లాభాలపై అమలయ్యే మూలధన రాబడి పన్ను వివరాలను సైతం నమోదు చేయాలి.
5. మీ ఆదాయం రూ.50 లక్షలు దాటితే...
ఈ ఏడాది నుంచి రూ.50 లక్షల ఆదాయం దాటిన వారి కోసం కొత్త నిబంధన వచ్చింది. రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగిన వారు వారి స్థిరాస్తి, చరాస్తి వివరాలను సైతం ట్యాక్స్ రిటర్నుల్లో చూపాల్సి ఉంది.
6. ఆదాయ మార్గాలు ఏమిటి?
రిటర్నులు ఫైల్ చేసేటప్పుడు ఏ మార్గం ద్వారా ఎంత ఆదాయం వస్తుందో స్పష్టంగా తెలపాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు ఇంటి అద్దె ద్వారా ఆదాయం వస్తుంటే ఇతర ఆదాయ మార్గాల్లో దాని గురించిన వివరాలివ్వాలి. ఈక్విటీ పెట్టుబడులపై ఉండే దీర్ఘకాల మూలధన రాబడి పన్ను, ఇంటిని అమ్మితే వచ్చే డబ్బు, ఇంకా ఇలాంటి ఇతర ఆదాయాలు ఏవైనా ఉంటే వాటిని చూపాలి.
7. రూ. 2 లక్షలకు మించి నగదు డిపాజిట్ చేసి ఉంటే
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేప్పుడు ఒక ప్రశ్నకు కొంత మంది సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది అందరికీ వర్తించదు. నవంబరు 9, 2016 నుంచి డిసెంబరు 30, 2016 వరకూ బ్యాంకులో రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్ చేశారా? అనేది.. ఒకవేళ మీరు రూ.2లక్షల విలువకు మించి ఈ నోట్లను జమ చేసినప్పుడు ఆ వివరాలను కచ్చితంగా పేర్కొనాలని ఐటీ శాఖ తెలిపింది.
8. ఫారం 26 ఏఎస్
మీ ఆదాయం నుంచి ఎంత పన్నుగా మినహాయింపు చేశారో అనే వివరాలు 26 ఏఎస్ ద్వారా తెలుస్తాయి. దీన్ని ట్రేసెస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫారం 26 ఏఎస్ పాన్తో లింకయి ఉంటుంది.
ఫారం 26ఏఎస్ ఓపెన్ అయ్యేందుకు డేట్ ఆఫ్ బర్త్(DDMMYYYY) పాస్వర్డ్గా ఎంటర్ చేయాలి.
2008-09 ఏడాది సమయం నుంచి కావల్సిన ఫారం 26ఏఎస్ను మనం చూసుకోవచ్చు.
9. ఈ-వెరిఫై
గతేడాది వరకూ మీరు రిటర్నులు ఫైల్ చేసిన తర్వాత పత్రాలను పోస్ట్లో బెంగుళూరు కార్యాలయానికి పంపాల్సి ఉండేది. ఈ ఏడాది నుంచి ఈ-వెరిపై చేస్తే చాలు. ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయడం పూర్తైన తర్వాత రీఫండ్ రావాల్సి ఉన్నా, లేకపోయినా బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయడం తప్పనిసరి. నెట్ బ్యాంకింగ్ ద్వారా రిటర్నులను ఈ-వెరిఫై చేయండి.
అందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీ ఆధార్ సంఖ్యను పాన్తో అనుసంధానం చేయకపోతే రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదు.
10. ఫారం ఎంపికలో జాగ్రత్త
మీరు రిటర్నులు ఫైల్ చేసేటప్పుడు మీరు ఏ ఫారాన్ని ఎంచుకోవాలో సరిగా తెలుసుకోవడం ముఖ్యం. రూ.50 లక్షల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులకు ఐటీఆర్ 1 ఫారం అవసరం.
హిందూ ఉమ్మడి కుటుంబం, ఇతర వ్యక్తిగత పన్ను మదింపుదార్లు ఐటీఆర్ 2 ఫారం వాడాలి.(వ్యాపారం, వృత్తి ఆదాయాలు మినహా మిగిలిన ఆదాయం వచ్చేవారు).
వ్యాపారం, వృత్తితో సహా ఇతర అన్ని రకాల ఆదాయాలు ఉన్నవారు ఐటీఆర్3 వాడాల్సి ఉంటుంది.(గతంలో ఐటీఆర్ 4 వర్తించే వారికి సైతం ఇదే)