ఎఫ్డీ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయా? ఈ పెట్టుబడులు మీ కోసమే...
ష్టపడి సంపాదించిన డబ్బు సాధారణ పెట్టుబడి పథకాల్లో పెడితే వచ్చే రాబడి కంటే మరింత ఎక్కువ కావాలని చూస్తున్నారు. అయితే అందరూ ఎక్కువ రిస్క్ తీసుకుని స్టాక్ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టే
ఆర్బీఐ గత రెండేళ్ల కాలంలో పలు మార్లు వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు ఎఫ్డీలను మంచి రాబడి వచ్చే సాధనాలుగా పరిగణించడం లేదు. కష్టపడి సంపాదించిన డబ్బు సాధారణ పెట్టుబడి పథకాల్లో పెడితే వచ్చే రాబడి కంటే మరింత ఎక్కువ కావాలని చూస్తున్నారు. అయితే అందరూ ఎక్కువ రిస్క్ తీసుకుని స్టాక్ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్దపడరు. ఈ నేపథ్యంలో తక్కువ నుంచి మొదలుకొని మీడియం టర్మ్లో మంచి రాబడి వచ్చే వివిధ పెట్టుబడి సాధనాలను ఇక్కడ చూద్దాం.
కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు
దేశంలో పొదుపు కోసం ఎక్కువ మంది ఉపయోగించే సంస్థాగత పొదుపు మార్గం బ్యాంకు డిపాజిట్లే. ఎక్కువ మంది పెట్టుబడిదారులకు మన డబ్బు సురక్షితంగా ఉందా, కచ్చితమైన రాబడి వస్తుందా అనేవే మొదటి ప్రాధాన్యతలు. బ్యాంకు ఎఫ్డీలు తక్కువ రాబడినిస్తుందని భావించే వారు కొంత మంది కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకోవడం సైతం ఈ మధ్యే ఎక్కువవుతోంది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఉన్నతి పథకం, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ఎఫ్డీ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎఫ్డీ వంటి వాటి గురించి ఏదో మార్గం ద్వారా మీరు తెలుసుకునే ఉంటారు. వీటిల్లో కచ్చితమైన రాబడికి హామీ లేకపోయినా మంచి రాబడి వస్తున్నట్లు ఇదివరకే పెట్టుబడి పెట్టినవారు చెబుతుంటారు.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు
నష్ట భయాన్ని తట్టుకునేందుకు సిద్దంగా ఉండేవారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ముఖ్యంగా వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో వినియోగదారుల పరంగా, వ్యాపార పరంగా చూసినా ఈక్విటీలు మంచి పనితీరును కనబరుస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు నేరుగా స్టాక్ మార్కెట్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. దీని ద్వారా మార్కెట్ హెచ్చు తగ్గుల ప్రభావం మీ పెట్టుబడులపై ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టే ఇక్కడ రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ మీడియం టర్మ్ నుంచి దీర్ఘకాల దృష్టితో చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు చాలా ఇతర రాబడుల కంటే మంచి పనితీరును కనబరుస్తున్నాయి.
ప్రభుత్వ బాండ్లు
ఫిక్స్డ్ డిపాజిట్లలో వచ్చే వడ్డీ తక్కువ అని భావించే వారికి మరో ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గం ప్రభుత్వ బాండ్లు. ఫిక్స్డ్ డిపాజిట్లలో కాలపరిమితి ముగియక ముందే వెనక్కు తీసుకుంటే వడ్డీ తగ్గించి ఇస్తారు. మన పెట్టుబడులకు వివిధ మార్గాల ద్వారా వైవిధ్యతకు చోటు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ బాండ్లు రక్షణ పరంగా ఒక మంచి మార్గం. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్లలో వచ్చే వడ్డీ ఎఫ్డీల కంటే ఎక్కువగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో అన్ని వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ పన్ను రహిత బాండ్లు ఇచ్చే వడ్డీ రాబడి ఎఫ్డీల కంటే మెరుగ్గానే ఉంటుంది. అయితే వీటిల్లో లిక్విడిటీ గురించి ముందుగానే తెలుసుకోవాలి. ఇన్వెస్టర్లు లాంగ్ టర్మ్ గిల్ట్ ఫండ్లను కూడా పరిశీలించవచ్చు.
జాతీయ పొదుపు పథకం(ఎన్ఎస్సీ)
పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి దేశంలో చాలా కాలం నుంచి ఆసక్తిగా ఉన్న ఆర్థిక సాధనం పోస్టాఫీసు జాతీయ పొదుపు పథకం. పన్ను ఆదా కోసం చాలా మంది ఇందులో పెట్టుబడి పెడతారు. ఇందులో కనీస పెట్టుబడి రూ.100 కాగా గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితులు లేవు. జాతీయ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు దేశంలోని అన్ని పోస్టాఫీసు శాఖలు అవకాశం కల్పిస్తాయి. ఒక్కో వ్యక్తి ఏడాదికి ఒక్కో ఖాతాను మాత్రమే తెరవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ)
కిసాన్ వికాస్ పత్ర పొదుపులో చక్ర వడ్డీ అమలవుతుంది. కేవీపీ పొదుపు మార్గంలో లాక్ ఇన్ పీరియడ్ మొదటి రెండున్నరేళ్లు ఉంటుంది. వీటికి భారత ప్రభుత్వం హామీ ఉంటుంది కాబట్టి భద్రతకు భరోసాగా ప్రజలందరూ వీటిపై నమ్మకంతో ఉంటారు. దీనిలో పెట్టుబడి పెట్టి సంవత్సరం లోపే వెనక్కు తీసుకునే ప్రయత్నం చేస్తే ఎటువంటి వడ్డీ చెల్లించరు. సీనియర్ సిటిజన్లకు స్థిర ఆదాయం పొందేందుకు కిసాన్ వికాస్ పత్ర బాగా ఉపయోగపడుతుంది. కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేట్లు తగ్గడంతో 9 ఏళ్ల 5 నెలల కాలానికి పెట్టుబడి రెండింతలవుతుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)
ప్రస్తుతం చాలా బ్యాంకులు ఎఫ్డీలపైన వడ్డీ రేట్లను తగ్గించాయి. అయినప్పటికీ పీపీఎఫ్ మాత్రం ఆకర్షణీయ పెట్టుబడి మార్గంగానే ఉంది. ప్రతి నెలా రూ. 1000 చొప్పున పొదుపు చేస్తూ పోతే 20 ఏళ్ల తర్వాత 8శాతం వడ్డీతో లెక్కిస్తే ఆ సొమ్ము చివరకు దాదాపు రూ.6 లక్షలు అవుతుంది. పెట్టుబడి దారులు కేవలం రూ.100 తోనే పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించవచ్చు. ఏడాదిలో కనీస పెట్టుబడి రూ.500, గరిష్ట పెట్టుబడి రూ. 1.50 లక్షలు. పీపీఎఫ్లో పెట్టుబడికి నగదు, చెక్కు, డీడీ ద్వారా డిపాజిట్ చేసే వీలు ఉంది. కొన్నిబ్యాంకులు ఆన్లైన్ ట్రాన్స్ఫర్కు సైతం అంగీకరిస్తున్నాయి. పీపీఎఫ్ మీద వచ్చే వడ్డీకి పూర్తి పన్ను మినహాయింపు ఉంది.
పోస్టాఫీసు పొదుపు పథకాలు
సురక్షితకు తావునివ్వడంతో పాటు, ఆకర్షణీయ పెట్టుబడి మార్గం కోసం పోస్టాఫీసు పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలో ఉండే 1.54 లక్షల పోస్టాఫీసుల ద్వారా ఈ పథకాలను పొందవచ్చు. పీపీఎఫ్ పోస్టాఫీసుతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖల్లో ఎంపిక చేసిన శాఖల్లో ఉంటుంది. పోస్టాఫీసు పొదుపు పథకాల్లో ఇంకా పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, జాతీయ పొదుపు పథకం వంటివి ఉంటాయి. ఇవి సాధారణంగా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీనే ఇస్తాయి.
డెట్ ఫండ్లు
బ్యాంకు డిపాజిట్లు వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో పెట్టుబడిదార్లు మ్యూచువల్ ఫండ్లలోని డెట్ ఫండ్లను మరో మార్గంగా ఎంచుకుంటున్నారు. సాధారణంగా డెట్ ఫండ్లన్నీ బ్యాంకు ఎఫ్డీల కంటే ఎక్కువ రాబడినిస్తుండటం, బ్యాంకు ఎఫ్డీల్లాగే ఎప్పుడు పడితే అప్పుడు వెనక్కి తీసుకునే వీలుండటమే ఇందుకు కారణం. డెట్ పెట్టుబడి సాధనాల్లో గిల్ట్ ఫండ్లు, ఇన్కమ్ ఫండ్లు, డైనమిక్ బాండ్ ఫండ్ల వంటివి లిక్విడ్ ఫండ్ల మాదిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తాయి. 12 నెలల కాలానికి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ మంచి ఎంపిక.
స్వల్పకాలానికి.. లిక్విడ్ ఫండ్లు
కేవలం మనీ మార్కెట్లోనే పెట్టుబడి పెట్టే పథకాలివి. ఏడాదికన్నా తక్కువ కాలపరిమితి ఉండే ట్రెజరీ బిల్లులు, ఇతర డెట్ ఫథకాల్లో ఇవి మదుపు చేస్తాయి. వీటిలో పొదుపు ఖాతాకన్నా ఎక్కువ వడ్డీనే అమలు అవుతుంది. ఏకమొత్తంలో మ్యూచువల్ ఫండ్లలో మదుపుచేయాలనుకునేవారు.. ముందుగా ఈ ఫండ్లలో జమ చేసి, ఆ తర్వాత క్రమానుగత బదిలీ విధానం (ఎస్టీపీ)లో కావాల్సిన పథకంలో మదుపు చేయడం వల్ల కలిసొస్తుంది. మీ లక్ష్యాలేమిటి? ఎంత పెట్టుబడి పెట్టగలరు? ఎన్నాళ్ల పాటు కొనసాగించగలరు అనేది ముందుగా నిర్ణయించుకున్నాకే ఫండ్లను ఎంచుకోండి. అప్పుడే అనుకున్న విధంగా రాబడి పొందవచ్చు.
ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు
బాండ్లు, డిపాజిట్ సర్టిఫికెట్, ప్రభుత్వ సెక్యూరిటీలు, కమర్షియల్ పేపర్లు లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టే పథకాలివి. వీటిల్లో నష్టభయం చాలా తక్కువ. 90రోజుల నుంచి 366 రోజులు, ఆపైన కాలావధులతో లభిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టడం వల్ల రాబడి తక్కువగా వస్తుందని భావించేవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. పన్ను పరంగా చూసినా ఇవి ప్రయోజనమే. స్వల్పకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికీ, ఏకమొత్తంలో సొమ్ము మదుపు చేయడానికీ ఇవి సరిపోతాయి. కాకపోతే.. వీటిలో ఎన్ఎఫ్ఓ సమయంలో మాత్రమే మదుపు చేసేందుకు వీలవుతుంది.