మ్యూచువల్ ఫండ్లలో ఏది మనకు నప్పుతుంది?
సాధారణంగా దీర్ఘకాలిక లక్ష్యాల్లో భాగంగా మార్కెట్ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం మన దేశంలో కూడా రోజురోజుకు ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. మార్కెట్ పెట్టుబడుల్లో అందరూ ఈక్విటీల వైపు మొగ్గుచూప
మీకు సరైన ఫండ్ ఏది?
ప్రతి ఒక్కరికీ సంపాదన అనేది కనీస ప్రాధాన్యంగా మారిపోయింది. అయితే ఆర్థికపరంగా చూస్తే ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి. లక్ష్యాలకు అనుగుణంగా మన సంపాదన, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు ఉండాలి. సమగ్రంగా పరిశీలించినప్పుడు వ్యక్తుల లక్ష్యాలు మూడు రకాలుగా ఉంటాయి. అవి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్షక్యాలు. సాధారణంగా దీర్ఘకాలిక లక్ష్యాల్లో భాగంగా మార్కెట్ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం మన దేశంలో కూడా రోజురోజుకు ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. మార్కెట్ పెట్టుబడుల్లో అందరూ ఈక్విటీల వైపు మొగ్గుచూపలేరు. ధైర్యం చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందకు కొంత మంది ఆసక్తి చూపరు. అలాంటి వారి కోసం మ్యూచువల్ ఫండ్లు బాగా నప్పుతాయి. అయితే పెట్టుబడుల ప్రారంభ దశలో ఏ ఫండ్లవైపు మొగ్గుచూపాలో తెలియదు. అలాంటి వారి కోసం వివిధ పండ్ల గురించిన సమగ్ర విశ్లేషణ.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు:
స్టాక్ మార్కెట్లో నమోదైన వివిధ కంపెనీల షేర్లలో మదుపు చేసేవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు. మదుపరుల నుంచి సమీకరించిన సొమ్మును అనేక రంగాలు, కంపెనీలకు మళ్లిస్తారు. దీనివల్ల పెట్టుబడుల్లో వైవిధ్యతకు చోటు కల్పిస్తారు. తద్వారా ఒకే కంపెనీలో మదుపు చేసినప్పుడు ఉండే నష్టభయం తగ్గుతుంది. ఈక్విటీ మార్కెట్లు స్వల్పకాలంలో కాస్త హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి, స్వల్పకాలిక పెట్టుబడుల్లో కాస్త నష్టభయం ఉంటుంది. అదే సమయంలో మంచి రాబడికీ ఇక్కడ అవకాశం ఉంటుంది. అందుకే 5, 10, 15, 20ఏళ్లు ఆపై దీర్ఘకాలం మదుపు చేయాలని నిపుణులు చెబుతుంటారు. సంపాదన ప్రారంభం అయిన వెంటనే ఈక్విటీల్లోనూ పెట్టుబడులు మొదలుపెట్టడం మేలు. దీనివల్ల భవిష్యత్తులో పిల్లల చదువులు, వారి వివాహాలు, పదవీ విరమణ ప్రణాళిక, ఇంటి కొనుగోలు తదితర లక్ష్యాలను సులభంగా సాధించేందుకు వీలవుతుంది.
ఈక్విటీ ఫండ్లలో రకాలు
ఈక్విటీ ఫండ్లలో లార్జ్క్యాప్, మిడ్క్యాప్, మల్టీక్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లు ఉంటాయి. నష్టభయాన్ని భరించే శక్తిని బట్టి మదుపరులు వీటిలో తమకు అనుకూలమైన ఫండ్లను ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా పన్ను ఆదా చేసుకోవాలని భావించే వారికి సరిపోయేవి ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్ఎస్ఎస్). వీటిలో మదుపు చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ నిబంధనల మేరకు రూ.1.5లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్లలో సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్లు ఉంటాయి. మార్కెట్ అవగాహన తక్కువ ఉన్నవారు వీటివైపు వెళ్లకపోవడం మంచిది.
డెట్ ఫండ్లు:
ఈ విభాగానికి చెందిన డెట్ ఫండ్లు ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వం జారీ చేసే ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్ బాండ్లు, కంపెనీలు జారీ చేసే కమర్షియల్ పేపర్లు, బ్యాంకుల్లో వివిధ కాలపరిమితులతో కూడిన డిపాజిట్ సర్టిఫికెట్లలో మదుపు చేస్తాయి. సంస్థలకు నిధులు అవసరం ఉన్నప్పుడు డెట్ సెక్యూరిటీలను జారీ చేస్తాయి. దీనర్థం వీటిని జారీ చేసి, రుణ రూపంలో నిధులు సేకరిస్తాయి. వడ్డీ రూపంలో ప్రతిఫలాన్ని అందిస్తాయి. ఈ వడ్డీ రేట్ల కదలికల ఆధారంగా ఫండ్ మేనేజర్లు పెట్టుబడులను నిర్వహిస్తుంటారు. సంస్థలు రుణాలు, వడ్డీ చెల్లించకపోవడంలాంటివి నష్టభయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మదుపు వ్యూహం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు మంచి క్రెడిట్ రేటింగులున్న రుణ పత్రాల్లోనే మదుపు చేస్తుంటారు.
ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే డెట్ ఫండ్లతో నష్టభయం అంతగా ఉండదు. అందువల్ల పెట్టుబడి కాస్త సురక్షితంగా ఉండాలని భావించే వారు ఈ రకం ఫండ్లను తమ పెట్టుబడి కోసం ఉపయోగించుకోవచ్చు. స్వల్పకాలంపాటు మదుపు చేయాలనుకునే వారికీ ఇవి నప్పుతాయి. రాబడి కూడా కాస్త మధ్యస్థంగానే ఉంటుంది.
బ్యాలెన్స్డ్ ఫండ్లు:
ఈక్విటీలు, డెట్ పథకాల సమ్మేళనమే ఈ ఫండ్లు. డెట్ పథకాల్లో మదుపు చేయడం ద్వారా తక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంది. అందుకే, దీర్ఘకాలంలో మంచి రాబడి ఉండేందుకు కొంత మొత్తం ఈక్విటీల్లో మదుపు చేయాలి. ఈక్విటీల్లో నష్టభయం ఉంటుంది. ఈ రెండింటినీ సమతౌల్యం చేస్తూ మదుపు చేయడమే ఈ ఫండ్ల వ్యూహం. మార్కెట్ పరిస్థితులను బట్టి, ఈక్విటీలు, డెట్ పథకాల్లో పెట్టుబడుల మార్పులు చేర్పులు చేస్తూ.. మంచి రాబడి సాధించేందుకు ఫండ్ మేనేజర్లు ప్రయత్నిస్తారు. అధిక నష్టభయం భరించలేని మదుపరులకు ఈ రకం ఫండ్లు సరిపోతాయి.
ముగింపు
భవిష్యత్తు అవసరాల కోసం మదుపు చేయాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్లు ఎంతో అనువైనవి. అదే సమయంలో తమ లక్ష్యాలను సాధించేందుకు సరైన ఫండ్ను ఎంచుకోవడమూ ఎంతో ముఖ్యం. ఏది మన అవసరానికి సరిపోతుందో, లక్ష్య సాధనకు తగ్గ పథకం ఏదో తెలుసుకోవాలి. అప్పుడే, సరైన నిర్ణయం తీసుకోగలం.
మ్యూచువల్ ఫండ్ పథకాలను నిపుణులు నిర్వహిస్తారు. పెట్టుబడి తీరును బట్టి ఇవి వైవిధ్యతను కలిగి ఉంటాయి. వీటిలో మనకు ఏది బాగుంటుందో తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి, వ్యక్తిగత ఆర్థిక సలహాదారుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చు. దీనికన్నా ముందు ఏ ఫండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడమూ మదుపరులకు అవసరమే.
మీ లక్ష్యాలేమిటి? ఎంత పెట్టుబడి పెట్టగలరు? ఎన్నాళ్లు ఆగగలరు అనేది ముందుగా నిర్ణయించుకున్నాకే ఫండ్లను ఎంచుకోండి. అప్పుడే అనుకున్న విధంగా రాబడి పొంది, సంపదను వృద్ధి చేసుకోగలరు. ఇందుకోసం వాల్యూరీసెర్చ్ఆన్లైన్, ఫండ్స్ ఇండియా వెబ్సైట్లను ఆశ్రయించవచ్చు.