మ్యూచువల్ ఫండ్లలో డివిడెండ్ లేదా గ్రోత్ ఆప్షన్ దేన్ని ఎంచుకోవాలి?
చాలా మందికి మార్కెట్ పెట్టుబడుల ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జించాలని ఉంటుంది. అయితే షేర్ మార్కెట్ అంటే భయం. ఎక్కువ రిస్క్ తీసుకోలేని వారు మార్కెట్ పెట్టుబడులు వైపు మొగ్గుచూపరు. అలాంటి వారి కోసమే ఇ
చాలా మందికి మార్కెట్ పెట్టుబడుల ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జించాలని ఉంటుంది. అయితే షేర్ మార్కెట్ అంటే భయం. ఎక్కువ రిస్క్ తీసుకోలేని వారు మార్కెట్ పెట్టుబడులు వైపు మొగ్గుచూపరు. అలాంటి వారి కోసమే ఇతర మార్కెట్ పెట్టుబడులున్నాయి. షేర్లలో మదుపు చేయడం ద్వారా అందే ప్రయోజనాన్ని మ్యూచువల్ ఫండ్లతోనూ పొందొచ్చు. అయితే, వీటి ఎంపికలో కూడా చాలా అంశాలను పరిశీలించాలి. మంచి పథకాన్ని ఎంచుకోవడంతోనే సరిపోదు. అందులోనూ.. డివిడెండ్, గ్రోత్ ఆప్షన్లలో ఎంది తీసుకోవాలన్నదీ చిక్కు ప్రశ్నే. దీని కోసం ఈ కథనాన్ని చదవండి.
పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
మదుపర్ల ఫండ్ ఆప్షన్ ఎంచుకోవడానికి ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
* రెగ్యులర్గా కొంత ఆదాయం కావాలనుకున్నవారు డివిడెండ్ రకాన్ని ఎంచుకుంటే మంచిది.
* మధ్యలో డబ్బుతో అంత అవసరం లేదు, సంపద వృద్ధి చెందితే చాలనుకునే వారికి ‘గ్రోత్' ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది.
* ఆదాయం కావాలి, కానీ డివిడెండ్పై డిస్ట్రిబ్యూషన్ పన్ను రూపంలో కోత పడకూడదంటే గ్రోత్ ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో అయితే ఆదాయ వృద్ధికి ఆస్కారం ఉంటుంది. * ఆదాయం అక్కర్లేనివారు స్పల్పకాలానికి గ్రోత్ ఆప్షన్ను ఎంచుకుంటే మూలధన లాభం పన్ను ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులు డివిడెండ్ను ఎంచుకుని రాబడిని తీసుకోకుండా డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఎంచుకోవాలి.
అవసరాలు, పన్ను ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని ఫండ్లలో ఆప్షన్లను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి లాభాలను అందుకోవచ్చు.
డివిడెండ్ ఆప్షన్:
షేర్లలో మదుపు చేసిన మ్యూచువల్ ఫండ్ ఆర్జించిన లాభాలను ఎప్పటికప్పుడు అందించే ఆప్షన్ ఇది. డివిడెండును ఎన్ఏవీపై కాకుండా.. యూనిట్ ముఖ (ఫేస్ వాల్యూ)విలువపై ప్రకటిస్తారు. డివిడెండ్ ఇచ్చిన తర్వాత ఆ పథకం యూనిట్ ఎన్ఏవీ ఆ మేరకు తగ్గుతుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు లాభాలు చేతికి అందుతాయి. ఈ డివిడెండుకు పన్ను ఉండదు. చిన్నచిన్న అవసరాలను తీర్చుకోవడానికి యూనిట్లు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు పది రూపాయలు ఫండ్లో మదుపు చేశారనుకుందాం. కొంతకాలానికి ఫండ్ ఎన్ఏవీ రూ.12కి పెరిగితే, రూ.2ను డివిడెండ్గా ప్రకటిస్తుంది. డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్న వారికి ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. డివిడెండ్ రూపంలో ఎప్పటికప్పుడు లాభాలు స్వీకరిస్తాం కాబట్టి, మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం అంతగా ఉండదు.
గ్రోత్ ఆప్షన్:
ఫండ్ ఆర్జించిన లాభాన్ని తిరిగి మదుపు చేస్తారు. కాబట్టి, నిర్ణీత కాలపరిమితుల్లో డివిడెండ్ ఉండదు. డివిడెండ్ ఆప్షన్తో పోలిస్తే.. గ్రోత్ ఆప్షన్ ఎన్ఏవీ ఎక్కువగా ఉండేందుకు గల కారణం ఇదే. షేర్లయినా, ఈక్విటీ ఫండ్లయినా.. దీర్ఘకాలం పాటు కొనసాగిస్తేనే మంచిది. గ్రోత్ ఆప్షన్ ఎంచుకుంటే దీర్ఘకాలం ఫండ్ల కొనసాగింపునకు అవకాశం కల్పిస్తుంది.
డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్:
ఇందులో డివిడెండ్ ప్రకటిస్తారు. కానీ, యూనిట్దారులకు ఇవ్వరు. డివిడెండుకు సమానమైన మొత్తాన్ని తగ్గట్టుగా అందనపు యూనిట్లు కేటాయిస్తారు. ఈ ఆప్షన్లో కూడా చెల్లించిన డివిడెండుకు తగ్గట్టు ఫండ్ యూనిట్ ఎన్ఏవీ తగ్గుతుంది. మీ ఖాతాలోని యూనిట్ల సంఖ్య మాత్రం పెరుగుతుంది.
పన్ను ప్రభావాలు
డివిడెండ్, గ్రోత్ ఆప్షన్ను ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం ఒకటుంది. అదే పన్ను ప్రభావం. డివిడెండ్, మూలధన లాభంపై వసూలు చేసే పన్నులు రెండూ భిన్నమైనవి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అందించే డివిడెండ్లకు పూర్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఈక్విటీ గ్రోత్ యూనిట్లను ఏడాదిలోపల అమ్మడం ద్వారా వచ్చే లాభంపై పన్ను ఉంటుంది. ఏడాది తర్వాత అమ్మితే దీర్ఘకాలికం అవుతుంది. అప్పుడు మూలధన లాభంపై ఎలాంటి పన్ను ఉండదు. 10శాతం శ్లాబులో ఉన్నప్పుడు గ్రోత్ ఆప్షన్ మేలు. 20లేదా 30శాతం పన్ను శ్లాబులో ఉంటే డివిడెండ్ లేదా డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు.
వీటి ఆధారంగా....
మీరు ఎంత కాలానికి పెట్టుబడులు పెడుతున్నారు, నగదు అవసరాలు, ఏ పన్ను శ్లాబులో ఉన్నారు అనే అంశాలు మీరు ఏ ఆప్షన్కు వెళ్లాలనే దాన్ని నిర్ణయిస్తాయి. లక్ష్యానికి తగ్గ ఫండ్ను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. మన అవసరాలు, నష్టభయాన్ని తట్టుకునే సామర్థ్యం ఆధారంగా ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్డ్ ఫండ్లలో మంచి ఫండ్లను చూసుకొని పెట్టుబడులు పెట్టాలి. దీంతో ఆగిపోకుండా.. ఆప్షన్ ఎంపికలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి మీ లక్ష్యం ఏంటో నిర్దేశించుకుని తగిన ఆప్షన్ను సరిగ్గా ఎంచుకోండి.