మొబైల్ వ్యాలెట్ అంటే ఏమిటి? వాటి వల్ల ప్రయోజనమా? నష్టమా?
అన్ని వర్గాల వినియోగదారులను ప్రస్తుతం ఎక్కువగా ఆకర్షిస్తున్న పదం మొబైల్ వ్యాలెట్. విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఈ-కామర్స్ చెల్లింపులు అంటే ఇదివరకూ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే. మొబైల్ వాలెట్ల
అన్ని వర్గాల వినియోగదారులను ప్రస్తుతం ఎక్కువగా ఆకర్షిస్తున్న పదం మొబైల్ వ్యాలెట్. విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఈ-కామర్స్ చెల్లింపులు అంటే ఇదివరకూ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే. మొబైల్ వాలెట్ల రాకతో అన్ని ఆర్ఠిక లావాదేవీలు ఒకచోట నుంచే చేసేలా కొత్త పద్దతులు వచ్చాయి. మొబైల్ రీచార్జీ నుంచి మొదలుకొని విమాన ప్రయాణ టిక్కేట్ల వరకూ అయ్యే చెల్లింపులన్నీ నిమిషాల వ్యవధిలో మొబైల్ నుంచే చేసేందుకు యువతరం మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో అందరికీ సుపరిచితమైన పదం "క్యాష్ బ్యాక్" అంటే మనం చేసే చెల్లింపులు ఆయా మొబైల్ వ్యాలెట్ల ద్వారా జరిపితే బిల్లులో కొంత శాతాన్ని కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. ఈ నేపథ్యంలో మొబైల్ వ్యాలెట్ల గురించి సమగ్ర సమాచారం తెలుసుకుందాం.
మొబైల్ వ్యాలెట్ అందించే సేవలు
దేశంలో ఉండే అన్ని టెలికాం కంపెనీల మొబైల్ రీచార్జీ, పోస్ట్పెయిడ్ బిల్లు చెల్లింపులను, డీటీహెచ్ రీచార్జీలను చేయవచ్చు.
కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, బీమా ప్రీమియంల చెల్లింపులనూ చేసే వీలును కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి.
బస్సు, రైలు, విమాన టికెట్ చార్జీలను సైతం మొబైల్ వ్యాలెట్ ద్వారా చెల్లించవచ్చు. ఇటీవల నవతరం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న అంశం ఈ-కామర్స్. ఆన్లైన్ షాపింగ్లో కొన్న వస్తువులకూ మొబైల్ వ్యాలెట్ ద్వారా డబ్బు చెల్లిస్తున్నారు. ఓలా, ఉబర్ క్యాబ్ సేవలను వినియోగించుకున్నందుకు అయ్యే ఖర్చులను చెల్లించేందుకు వ్యాలెట్లను వినియోగించుకోవచ్చు.
ఆర్బీఐ నియమావళి
ర్బీఐ సమయానుసారంగా విదించే నిబంధనలన్నీ మొబైల్ వ్యాలెట్ కంపెనీలకు వర్తిస్తాయి.
అన్ని మొబైల్ వ్యాలెట్ కంపేనీలు పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్స్) నుంచి డబ్బు విత్ డ్రాయల్స్కు అనుమతి పొంది ఉండవు.
గరిష్టంగా రూ. 10 వేల వరకూ చెల్లింపులు చేసేందుకు ఆర్బీఐ అంగీకరించింది.
వ్యాలెట్లో రూ. 10 వేల వరకూ వ్యాలెట్లో నగదు కలిగి ఉండేందుకు వినియోగదారుడి మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ ఇవ్వడం తప్పనిసరి.
నగదు రూ. 10 వేలు దాటితే బ్యాంకు ఖాతాకు అనుసరించే కేవైసీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
ఒక్కో నెలలో గరిష్టంగా రూ. 1 లక్ష దాకా వాలెట్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు. అయితే బ్యాంకు ఖాతాకు పంపించే డబ్బు విషయంలో నాన్-కేవైసీ వ్యాలెట్కు రూ.10 వేల వరకూ, కేవైసీ వ్యాలెట్కు రూ. 25 వేల వరకూ అనుమతి ఉంది.
రెండంచెల గుర్తింపు
ఏ మొబైల్ వ్యాలెట్ అయినా చెల్లింపుల కోసం వ్యక్తిగత గుర్తింపును రెండంచెల్లో తనిఖీ చేస్తుంది.
మొదట లాగిన్ అయ్యేందుకు ఖాతా యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఉపయోగిస్తారు. లేదా ఫేస్బుక్ / జీమెయిల్ ద్వారా సైతం లాగిన్ అవ్వొచ్చు.
తదుపరి చెల్లింపులు జరిపేముందు రెండు మూడు రకాలుగా వ్యక్తిగత గుర్తింపును నిర్దారిస్తారు.
* మొబైల్ ఓటీపీ ద్వారా
* డెబిట్ కార్డు పిన్ / 3డీ సెక్యూర్ పిన్ ద్వారా
అన్నీ చెల్లింపులనూ డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే వీలుంటుంది.
క్యాష్ బ్యాక్ ఆఫర్లుః
మొబైల్ వ్యాలెట్లు ఎక్కువగా గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం క్యాషబ్యాక్ ఆఫర్లు. దేశంలో పేరెన్నికగన్న వ్యాలెట్లు ఇవే...
మొదటిసారి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక పరిమితి మేరకు 100 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్లను వ్యాలెట్లు అందిస్తున్నాయి.
క్యాష్బ్యాక్ అనేది తిరిగి వస్తువులను కొనేందుకు, సేవలను వినియోగించుకున్నందుకు అయ్యే ఖర్చులను చెల్లించేందుకై ఉపయోగించాల్సి ఉంటుంది.
దీన్ని సాధారణ నగదుగా భావించరాదు.
క్యాష్బ్యాక్ ఆఫర్లను ఉపయోగించుకునేందుకు కూపన్కోడ్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
వ్యాలెట్లతో తస్మాత్ జాగ్రత్త!
పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడంతో చెల్లింపుల విషయంలో ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో దాదాపుగా చాలా బిల్లు చెల్లింపులను పూర్తిచేయవచ్చు. అయితే కొంత మంది కార్డు, నెట్ బ్యాంకింగ్ల ద్వారా చెల్లింపులు చేసేందుకు అయిష్టత చూపుతుంటారు. అలాంటి వారిలో కొంత మంది క్యాష్ బ్యాక్లు ఇస్తున్నారు కాబట్టి వ్యాలెట్లపై ఆసక్తి చూపుతుంటారు. ఏది ఏమైనా పేరున్న వ్యాలెట్లను వాడితేనే లావాదేవీల్లో భద్రత ఉంటుంది. లేకపోతే మీ వివరాలు తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఆఫర్ల కోసం పెద్దగా తెలియని వ్యాలెట్లను వాడితే ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది.