ఈ ఏడాది ఆదాయపు పన్నులో జరిగిన మార్పులేంటి?
పన్ను చెల్లింపుదార్లకు స్వల్ప ఊరట కల్పించారు. ధరోల్బణం మామూలుగానే ఉన్నప్పటికీ మెట్రో నగరాల్లో సగటు వేతన జీవులు పన్ను చెల్లింపులకు పడుతున్న ఇబ్బందులకు స్వల్పంగా వెసులుబాట్లు ఇచ్చారు.
అన్ని రంగాల్లోనూ ఆర్థిక వృద్దిని సాధించే దిశగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 బడ్జెట్ను సమతౌల్యంగా ప్రతిపాదించారు. పాత పెద్ద నోట్ల మార్పిడి తర్వాత సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్లే పన్ను చెల్లింపుదార్లకు స్వల్ప ఊరట కల్పించారు. ధరోల్బణం మామూలుగానే ఉన్నప్పటికీ మెట్రో నగరాల్లో సగటు వేతన జీవులు పన్ను చెల్లింపులకు పడుతున్న ఇబ్బందులకు స్వల్పంగా వెసులుబాట్లు ఇచ్చారు. బడ్జెట్లో భాగంగా ఆదాయపు పన్ను విషయంలో జరిగిన మార్పులను తెలుసుకుందాం.
పన్ను రేటు 10 నుంచి 5 శాతానికి
వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి అతి తక్కువ పన్ను కట్టించే వారికి కొంచెం సంతోషమే కలిగించారు. పన్ను శ్లాబుల్లో మార్పులు చేయకుండా పన్ను శాతాన్ని తగ్గించారు. పన్ను చెల్లించే వారి జనాభా తగ్గకుండా ఉండే ప్రయత్నాలు చేశారు. రూ. 2,50,000-5,00,000 మధ్య ఆదాయం కలిగిన వారికి 10% పన్ను రేటును 5 శాతానికి తగ్గించారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు ఇది ఊరటే. దీనివల్ల ఏ స్థాయి శ్లాబులో ఉన్నవారికైనా పన్ను చెల్లింపుదారులకైనా గరిష్టంగా రూ. 12,500 ప్రయోజనం లభిస్తుంది.
రూ. 5 వేల రిబేటు
2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 5 లక్షల రూపాయల్లోపు సంపాదించే వారికి ప్రత్యేక రిబేటు రూపంలో మరో రూ. 5వేల వెసులుబాటు కల్పించారు. 10% ఉన్న శ్లాబును 5 శాతానికి తగ్గించినందున ఈ రిబేటును కూడా సగానికి తగ్గించి రూ. 2,500కు మార్చారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. రూ. 3,50,000 లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని చెప్పారు. మొత్తానికి చూస్తే రూ. 3 లక్షల కన్నా తక్కువ ఉంటే అలాంటి వారందరికీ రిబేటు వల్ల ఎలాంటి ఆదాయపు పన్ను ఉండబోదు.
10 శాతం సర్చార్జీ
రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు ఆర్జించేవారు పన్ను శ్లాబు ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడంతో పాటు, 10% సర్చార్జీ చెల్లించాలని ప్రతిపాదించారు. రూ. కోటి ఆదాయం దాటిన వారికి 15 శాతం సర్చార్జీ ఎలాంటి మార్పు లేదు. దీనివల్ల అధిక ఆదాయం ఉన్న వారికి పన్ను శ్లాబు తగ్గడం వల్ల అందే ప్రయోజనం కన్నా భారమే అధికం.
ఒకే పేజీలో రిటర్నులు
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలును సులభతరం చేసేందుకు రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఒకే పేజీలో ఉండే రిటర్నుల పత్రాన్ని సమర్పిస్తే చాలు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప వీరిపై ఎలాంటి తనిఖీలు కూడా ఉండవని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
దీర్ఘకాల రాబడి పన్నుకు వ్యవధి తగ్గింపు
ఇటీవలి బడ్జెట్ వరకూ ఉన్న నిబంధనల ప్రకారం స్థిరాస్తిని అమ్మాలంటే పన్ను భయాలు ఉండేవి. ఒక స్థిరాస్తిని మొదట కొని అమ్మితే, ఆ కాలపరిమితి 3 ఏళ్ల తర్వాత అయితేనే దీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను వర్తించేది. కొన్న తర్వాత 3 సంవత్సరాల గడువు తర్వాత అమ్మితేనే అప్పుడు దానికి దీర్థకాలిక పన్ను రాబడి లెక్కింపు కోసం అవకాశం ఉండేది. ఒకవేళ 3 ఏళ్ల లోపు అమ్మితే స్వల్పకాలిక మూలధన రాబడిగా ఎలాంటి మినహాయింపులూ లేకుండా చూపించవలసి ఉండేది. ఈ వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు. దీంతో 24 నెలల తర్వాత స్థిరాస్తులను విక్రయిస్తే మూలధన లాభాల పన్ను(స్వల్పకాలిక) బెడద తప్పుతుంది.
ఆదాయం రూ. 5 లక్షల లోపు, ఆ పైన ఉన్న వారి విషయంలో
5 లక్షల రూపాయల వార్షికాదాయం దాటని వ్యక్తులకు సెక్షన్ 87 ఎ కింద పన్ను మినహాయింపు ప్రస్తుతం రూ. 2వేలు మాత్రమే ఉండగా, దాన్ని ఇప్పుడు 5 వేలకు పెంచారు. దాంతో దాదాపు 2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఒక్కొక్కరికి రూ. 3వేల చొప్పున ఊరట లభిస్తుంది. ఇక మిగిలిన వారి సంగతి చూస్తే రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం, 5 నుంచి 10 లక్షల మధ్య ఉండే మొత్తానికి 20 శాతం, 10-50 లక్షల మధ్య ఉండే మొత్తానికి 30 శాతం పన్ను చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇంతకు ముందు 20%, 30% శాతం పన్ను శ్లాబులో ఉండే వారి విషయంలో ఎలాంటి మార్పు జరగలేదు.