టాటా సన్స్ నవ శకం చంద్రశేఖరన్తో సాధ్యమయ్యేనా?
ఉప్పు నుంచి ఉక్కు, విమానయాన రంగం వరకూ తనదైన ముద్ర వేసిన టాటా గ్రూప్ గత కొన్ని నెలల కాలం నుంచి వివాదాల్లో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి తాత్కాలికంగా తెరదించేందుకు క
ఉప్పు నుంచి ఉక్కు, విమానయాన రంగం వరకూ తనదైన ముద్ర వేసిన టాటా గ్రూప్ గత కొన్ని నెలల కాలం నుంచి వివాదాల్లో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి తాత్కాలికంగా తెరదించేందుకు కంపెనీ మంచి ప్రయత్నం చేసింది. దేశంలోని వ్యాపార దిగ్గజాల్లో ముందు వరుసలో ఉండే టాటా సన్స్ తమ సంస్థ కొత్త చైర్మన్గా అనుబంధ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) సిఇఓ నటరాజన్ చంద్రశేఖరన్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం తమ సంస్థకు తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తున్న రతన్ టాటాతో పాటు ఇటీవల చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్ను నియమిస్తున్నట్లు టాటా సన్స్ స్పష్టం చేసింది. రతన్ టాటా అధ్యక్షతన గురువారం జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వ్యాపారవర్గాలు, సన్నిహితులు 'చంద్ర'గా పిలిచే చంద్రశేఖరన్ ఫిబ్రవరి 21న టాటా సన్స్ సారథ్య బాధ్యతలు స్వీకరిస్తారని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో టాటా సన్స్లో చంద్రశేఖర్ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
కళాశాల నుంచి కార్పొరేట్ అధిపతి వరకూ
ఆయన పూర్తి పేరు నటరాజన్ చంద్రశేఖరన్. ఆయన వయసు 54 ఏళ్లు.
1963లో జన్మించిన చంద్రశేఖరన్ తమిళనాడులోని 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచురాపల్లి'లో కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1987లో టాటా సంస్థ టీసీఎస్లో తన ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. దాదాపు గత 30 సంవత్సరాలుగా ఆయన సంస్థలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది. సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పని చేస్తున్న సమయంలో.. 2009 అక్టోబరు 6న ఆయనను టాటా సన్స్ బోర్డు టీసీఎస్ సీఈవో బాధ్యతలను అప్పగించింది. 2014లో ఐదేళ్ల పదవీ కాలం ముగిసినా... రెండోసారి ఆయనకే బాధ్యతలు అప్పగించారు. గత సంవత్సరం అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీకి టాటా గ్రూపు ఛైర్మన్ పదవి నుంచి ఉద్వాసన పలికిన ఒక రోజులోనే చంద్రశేఖరన్ను టాటా బోర్డులోకి తీసుకోవడం గమనార్హం.
విలువలు కాపాడడమే నా లక్ష్యమన్న కొత్త ఛైర్మన్
టాటా గ్రూప్ ప్రస్తుతం సంధిదశలో ఉన్నదని, శతాబ్దాలుగా ఆ సంస్థ పాటిస్తున్న విలువలు కాపాడుతూ ముందుకు నడిపించడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని చంద్రశేఖరన్ అన్నారు. టాటా సన్స్ సారథిగా ఎంపికైన అనంతరం ఆయన విలేకరులతో సంక్షిప్తంగా మాట్లాడారు. వారి నుంచి ఎలాంటి ప్రశ్నలు అనుమతించలేదు. టాటా గ్రూప్ పాటించే విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో తాను ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతానని ఆయన అన్నారు. ఎంత పెద్ద బాధ్యతను భుజానెత్తుకున్నానో తనకు తెలుసునని, ఆ బాధ్యతను తాను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చంద్రశేఖరన్ భరోసా వ్యక్తం చేశారు. టాటాల వ్యాపారకుటుంబంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ సమయం పని చేసి ఈ హోదాకు చేరడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన వెల్లడించారు.
చంద్రశేఖరన్ కి ఉన్న అదనపు అర్హతలు
అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ ఆర్ధిక స్థితిగతులపై అవగాహన ప్లస్ పాయింట్లు. జీఈ, జేపీ మోర్గాన్, వాల్మార్ట్, హోమ్ డిపో, క్వాంటాస్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఏబిబి, సిస్కో, వొడాఫోన్ వంటి గ్లోబల్ కంపెనీల సరసన టిసిఎస్ని నిలిపిన ఘనుడిగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. డిజిటల్ యుగంపై అవగాహన ఉన్న చంద్రశేఖరన్ టాటాసన్స్ గ్రూప్ ఛైర్మన్ పదవికి సరైనోడని ఇండస్ట్రీ వర్గాల అంచనా..అలానే రెగ్యులర్ గా గ్లోబల్ మారథాన్ లో పాల్గొన్న అనుభవం..వర్టికల్ గ్రూప్ ని నడిపించగల సామర్ధ్యం ఆయన్ని ఈ పదవికి ముందుండేలా చేసాయ్. 1987లో టిసిఎస్ లో ప్రోగ్రామర్ గా ప్రారంభమై..,సంస్థలో 2007నాటికి సిఓఓగా ఎదిగాడాయన. సిటిగ్రూప్ కి చెందిన బ్యాక్ ఆఫీస్ ను టిసిఎస్ కొనుగోలు చేయడంలో ఆయనే ముఖ్యపాత్ర పోషించాడంటారు.అలానే టాటా గ్రూపులోనే అత్యంత చిన్న వయసు కలిగిన సిఈఓగా రికార్డు సృష్టించాడు చంద్రశేఖరన్.. ఆయన హయాంలోనే టిసిఎస్ టెన్ బిలియన్ డాలర్స్, ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ కంపెనీ గా మారింది. రానున్న రోజుల్లో 20 బిలియన్ డాలర్ రెవెన్యూ కంపెనీగా మారాలనేది ఆయన టార్గెట్. ఆపరేషన్స్ విత్ విజన్ అనే ట్యాగ్ లైన్ తో చంద్ర పని చేస్తారని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా చెప్తారు. టిసిఎస్ లాంటి కంపెనీకి సిఈఓగా పని చేస్తూ బిజీగా ఉంటూ కూడా ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. 2020 ఐటీ ఇండస్ట్రీ విజన్ నాస్కామ్ ఛైర్మన్ గా 2012లో పని చేసినపుడు ఆయనే రూపొందించారు.
సానుకూలతలే కాదు... సవాళ్లు సైతం స్వాగతం పలుకుతాయ్
మొదటి నుంచి టాటా గ్రూపులో ఉండటం ప్రధానమైన సానుకూలత. అయితే మిస్త్రీ తొలగింపు నుంచి మొదలైన పలు వివాదాల నేపథ్యంలో చంద్ర పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. సైరస్ మిస్త్రీ చేస్తున్న పోరాటం ఏ మలుపులు తిరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. టాటా గ్రూపులో దశాబ్దాలుగా సాగుతున్న వ్యక్తిగా, సంస్థ విలువలు, నైతిక బాధ్యతలు పూర్తిగా తెలియడం ఆయనకు ఉన్న ప్రధానమైన అనుకూలమైన అంశం. రాల్ఫ్ స్పెత్తో పాటు టాటా సన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన చంద్రశేఖరన్, అప్పటి నుంచి బాంబే హౌస్(టాటా గ్రూపు కార్యాలయం)లో హడావిడిగా కనిపిస్తున్నారు. ఎక్కువగా రతన్ టాటా పక్కనే ఉంటుండం జరుగుతోంది. గత మూడు నెలలుగా రతన్ ఆధ్వర్యంలో పలు అంశాలను ఆయన అవగాహన చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కార్పొరేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వ్యక్తిగత జీవితం
వృత్తిజీవితంలో చాలా మంది విజయవంతం అవుతారు. ఉరుకుల పరుగుల జీవన శైలి కారణంగా చాలా మంది వ్యాపార వ్యక్తులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అయితే రెండింటినీ సమతౌల్యంగా నడిపే వ్యక్తులో చంద్రశేఖరన్ ఒకరు. ఆయన పరుగుల వీరుడే కాకుండా ఫోటోగ్రాఫర్ కూడా. మారథాన్ రన్నర్గా చంద్రకు పేరుంది. ప్రపంచవ్యాప్తంగా ఆమ్స్టర్డ్యామ్, బోస్టన్, చికాగో, బెర్లిన్, ముంబై, న్యూయార్క్, స్టాక్హోమ్, టోక్యో మొదలైన నగరాల్లో పలు మారథాన్ పోటీల్లో పాల్గొనడం రన్నింగ్పై ఆయనకు ఉన్న అమితాసక్తిని తెలియజేస్తుంది. సంగీతంపై సైతం ఆయనకు మక్కువ ఉంది. తమిళనాడులో 1963లో జన్మించిన ఆయనకు భార్య, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం ముంబయిలో నివాసం ఉన్నారు.
టాటా గ్రూప్ గురించి
ఈ కంపెనీ వ్యవస్థాపకుడు జమ్షెడ్జీ టాటా. గ్రూప్ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. వ్యాపార పెట్టుబడులలోనూ, రాబడులలోనూ టాటా సన్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్, వ్యాపార విశ్వాసం, విలువలను కాపాడటంలో టాటా సంస్థలు వాటికవే సాటి. ప్రపంచంలోనే పలుసార్లు టాటా గ్రూప్ మంచి బ్రాండ్గా పేరొందింది. ఉక్కు, ఆటోమొబైల్స్, సమాచార సాంకేతికత, కమ్యూనికేషన్, విద్యుత్తు, తేనీరు(టీ), ఆతిథ్య రంగాలలో ప్రధానంగా వ్యాపార విస్తరణ ఉంది. టాటా గ్రూప్ తన వ్యాపార లావాదేవీలను ఆరు ఖండాలలోని 100కు పైగా దేశాలలో విస్తరించింది. తమ సంస్థల వస్తువులు, ఉత్పత్తులను 80కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. టాటా గ్రూపులో 114 సంస్థలు, అనుబంధ సంస్థలన్నీ కలిపి ఏడు వ్యాపార విభాగాలుగా ఉన్నాయి. టాటా గ్రూపులో చెప్పుకోదగ్గ అంశం దాని లాభాలు 65.8శాతం సమాజ సేవా సంస్థల్లో ఉంది.
టీసీఎస్ దేశ సాఫ్ట్వేర్కే మకుటాయమానం
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2016లో రెవెన్యూ: రూ.107542 కోట్లు, లాభం: రూ. 23972 కోట్లతో రాణించింది. టీసీఎస్ లెవల్ 5 సంస్థ. దేశంలో ఎక్కువగా ఉద్యోగాలు కల్పించే సంస్థల్లో ఇది ఒకటిగా ఉంది. ఎన్. చంద్ర శేఖరన్ ప్రస్తుతం కంపెనీ సీఈవోగా వ్యవహరించిన క్రమంలో సంస్థ కొత్త పుంతలు తొక్కింది. అమెరికా,యూకే, ఆగ్నేసియా దేశాలు(సింగపూర్, మలేషియా), భారతదేశం వంటి పలు చోట్ల వీరికి క్లైంట్లు ఉన్నారు. అమెజాన్, అడోబ్, శ్యాప్,ఒరాకిల్, వీఎమ్వేర్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో పనికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. టీసీఎస్కు 60 అనుబంధ సంస్థలున్నాయి. 45కు పైగా దేశాల్లో 3,71,000 వేల మంది ఉద్యోగులు టీసీఎస్ కోసం పనిచేస్తున్నారు. మార్చి,2016తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 16.5 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని కలిగి ఉంది.