2017 బడ్జెట్ నుంచి వివిధ రంగాల వారు ఆశిస్తున్నదేమిటి?
ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. నోట్ల రద్దుతో పరిశ్రమ వర్గాలు ఎదుర్కొన్న కష్టాలకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయాలు బడ్జెట్లో ఉంటాయని చాలా మంది ఆశిస్తున్నారు. వివిధ ర
కేంద్ర బడ్జెట్ 2017-18 నుంచి వివిధ రంగాల వారు రకరకాలుగా ఆశలుపెట్టుకున్నారు. ఈ ఏడాది నుంచి రైల్వే బడ్జెట్ను సైతం ప్రధాన బడ్జెట్లో కలుపుతున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. నోట్ల రద్దుతో పరిశ్రమ వర్గాలు ఎదుర్కొన్న కష్టాలకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయాలు బడ్జెట్లో ఉంటాయని చాలా మంది ఆశిస్తున్నారు. వివిధ రంగాల నుంచి పరిశ్రమల పెద్దలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు అరుణ్ జైట్లీ నుంచి ఏయే ఆశలు పెట్టుకున్నారో చూద్దాం.
జెమ్స్ అండ్ జువెలరీ
పాన్ తప్పనిసరి చేసిన పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని బంగారు, విలువైన ఆభరణాల వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 5 శాతానికైనా తగ్గించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 10% సుంకం కారణంగా ఆభరణాల పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోందని వారు వాపోతున్నారు. దీని వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడి బంగారం స్మగ్లింగ్కు అవకాశం ఏర్పడుతోందని వారంతా వాదిస్తున్నారు. అందుకే దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గించగలిగితే దీన్ని నివారించవచ్చని జెమ్స్ అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్ ప్రభుత్వానికి సూచిస్తోంది. అంతే కాకుండా పరోక్ష పన్నుల్లో ఏకరీతి విధానం కోసం దేశమంతా జీఎస్టీ రానున్నందున జెమ్స్ అండ్ జువెలరీ రంగానికి కనీసంగా 1.25% పన్నును విధించాల్సిందిగా వారు కోరుతున్నారు.
ఫార్మా
తమ పరిశ్రమకు విధించే పన్నులపైన స్పష్టత ఇవ్వడంతో పాటు, పరిశోధన,అభివృద్ది(ఆర్ అండ్ డీ) కోసం కొన్ని రాయితీలు కల్పించాల్సిందిగా ఫార్మా పరిశ్రమ విన్నవిస్తున్నది. అంతే కాకుండా కార్పొరేట్ పన్నును దశలవారీగా 25% ఎలా తగ్గిస్తారో రోడ్మ్యాప్ తయారుచేయాల్సిందిగా బడ్జెట్ విన్నపాల్లో భాగంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్ అండ్ డీ కోసం ఉపయోగించే ఎక్సైజ్ పరిధిలోకి వచ్చే అన్ని వస్తువులను ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయించాల్సిందిగా విన్నవించారు. ఫార్మా ఉత్పత్తులకు ముడి సరుకుకు, తుది ఉత్పత్తులకు ఎక్సైజ్ సుంకాన్ని 12%, 6% గా వేర్వేరుగా ఉంచే విధంగా చూడాలని కోరారు. సేవా పన్ను చెల్లింపులకు సంబంధించి రివర్స్ చార్జ్ బేసిస్లో సెన్ వ్యాట్ను ఉపయోగించుకునే విధంగా చూడాలని ప్రభుత్వానికి సూచించారు.
అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఈ బడ్జెట్ ద్వారా సానుకూల సంకేతాలు పంపాలని అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ అసోషియేషన్ ప్రభుత్వాన్ని అడుగుతోంది. మెడికల్ పరికరాలపై ఉన్న అధిక కస్టమ్స్ సుంకాలని తగ్గించాలని మెడికల్ టెక్నాలజీ అసోషియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది.
ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలుగా ఉండాలి: అసోచామ్
ఆదాయం పన్ను పరిమితిని పెంచడంపై మధ్యతరగతి ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. అసోచామ్ లాంటి సంస్థలు కూడా ప్రస్తుతం ఉన్న రూ. 2.50 లక్షల ఆదాయపుపన్ను పరిమితిని రూ. 5.00 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. ఇండియన్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ప్రమోషన్ (ఐబీపీఎస్) పథకాన్ని ప్రత్యక్ష పన్ను ప్రయోజనాలతో అనుసంధానించాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ కోరుతోంది. చిన్న పట్టణాల్లో బీపీవో యూనిట్లను నెలకొల్పితే ఐబీపీఎస్ ద్వారా ఒక్కో సీటుకు రూ. 1 లక్ష ఖర్చుపెడితే ఆ సొమ్ము లేదా దానికి సంబంధించి 50% వరకూ రాయితీని ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ రంగానికి నిధులు సమకూరేందుకు గాను వెంచర్ క్యాపిటల్ పూల్ను బ్యాంకు లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సి ఉందని అసోచామ్ సూచించింది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల పన్ను ఆదా పరిమితి పెంచాల్సి ఉంది: సెబీ
బ్యాంకింగ్ అండ్ ఆర్థిక రంగంపై ఆయా పరిశ్రమలు, నిపుణులు చాలా ఆశలే పెట్టుకున్నారు. మ్యూచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడి సాధనాలపై విధించే పన్నుల్లో హేతుబద్దీకరణ ఉండాలని సెబీ ప్రభుత్వానికి సూచించింది. స్టాక్ ట్రేడింగ్ పైన ఉండే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ని తగ్గించాలని సెబీ ఆర్థిక శాఖను కోరిటన్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం అన్ని స్టాక్ మార్కెట్ లావాదేవీలకు 0.017 నుంచి 0.125 శాతం వరకూ ఎస్టీటీని విధిస్తున్నారు. అదే విధంగా పన్ను ప్రయోజనాల కోసం దీర్ఘకాల డెట్ఫండ్లను ఉంచుకునే కనీస కాలపరిమితిని 36 నెలల నుంచి 12 నెలలకు తగ్గించాలని సెబీ సలహా ఇచ్చింది. ఇంకా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ట్యాక్స్ సేవింగ్ స్కీమ్లకు ఇస్తున్న పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 2లక్షలకు పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
ద్రవ్య లోటు 3% లోపే ఉండాలి: హెచ్ఎస్బీసీ
ద్రవ్య విధానం మార్పు, కార్పొరేట్ పన్నులో హేతుబద్దీకరణ, పల్లె ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయింపు, సామాజిక పథకాలకు ఖర్చు పెట్టే నిధుల్లో ఉత్పత్తి సామర్థ్యం పెంపు వంటి వాటిని ఉండేలా చూడాల్సి ఉందని హెచ్ఎస్బీసీ నివేదిక ప్రభుత్వానికి విన్నవించింది. ద్రవ్య లోటును 2016-17లో ఉన్న 3% పరిమితిలోనే ఉండేలా చూడాల్సి ఉందని ఈ ఆర్థిక సేవల నిర్వహణ సంస్థ అభిప్రాయపడింది. జీఎస్టీ అమలు నేపథ్యంలో రాష్ట్రాలకు చెల్లించే నష్ట పరిహారం కోసం అవసరమైతే అధిక నిధులు కేటాయించి అయినా ముఖ్యమైన ద్రవ్యలోటును జీడీపీలో 0.3% లోపే నియంత్రించాల్సి ఉందని హెచ్ఎస్బీసీ భారతదేశ ముఖ్య అధికారి ప్రంజుల్ భండారీ వెల్లడించారు. గ్రామీణ భారతం ముఖ్యంగా గృహ వసతి, రోడ్లు, నీటి పారుదల మొదలైన వాటి కోసం మూలధన కేటాయింపుల పెరుగుదల ఉంటుందని ఈ నేపథ్యంలో ప్రజల పన్ను మినహాయింపు పరిమితి పెంచితే పొదుపు పెరిగి తద్వారా పెట్టుబడులకు నిధులు సమకూరొచ్చని భండారీ అన్నారు.
ద్రవ్యలోటు లక్ష్యాన్ని 2017-18లో జీడీపీలో 3 శాతానికి : నోమురా
ఇప్పుడు ప్రకటించే బడ్జెట్ పెద్దగా ప్రజాకర్షకంగా ఉండకపోవచ్చని జపనీస్ ఆర్థిక సంస్థ నోమురా అభిప్రాయపడింది. ఒక పక్క నోట్ల రద్దు నేపథ్యంలో వృద్ది పక్కదారి పట్టిందని భావిస్తున్నా ప్రభుత్వం పెద్దగా ప్రజాకర్షక పథకాలు ప్రకటించబోదని అంచనా వేసింది. 2017-18 సంవత్సరంలో ద్రవ్యలోటును 3% లోపే కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రజలను మెప్పించే బడ్జెట్ను ప్రకటించదలచినా ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లకపోవచ్చని నోమురా అభిప్రాయపడింది. 2016-17 ఏడాదికి నిర్ణయించిన 3.5% ద్రవ్యలోటు లక్ష్యాన్ని 2017-18లో జీడీపీలో 3 శాతానికి లోపే కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయనున్న నేపథ్యంలో పలు చర్యలు చేపట్టవచ్చని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం గ్రామీణాభివృద్దికి నిధుల కేటాయింపు, గృహ వసతికి, మౌలిక సౌకర్యాలకు ప్రభుత్వ ప్రాధాన్యత ఉండవచ్చని ఊహిస్తున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రభుత్వం పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 2.5 లక్షల నుంచి పెంచవచ్చని నోమురా అంచనా వేస్తోంది.
డెట్ ఆధారిత పథకాలకు 80 సీసీసీ కింద
ఆదాయపు పన్ను చట్టం 80సీసీసీ ప్రకారం డెట్ ఆధారిత పొదుపు పథకాలకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కల్పించాల్సి ఉందని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమల సమాఖ్య యాంఫీ ప్రభుత్వానికి అభ్యర్థన పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆర్జీఈఎస్ఎస్కే పరిమితం చేసిన పన్ను ప్రయోజనాలను అందరూ ఈక్విటీ ఇన్వెస్టర్లకు విస్తరించాలని కోరుతున్నారు. మ్యూచువల్ ఫండ్ పథకాల్లో 3-5 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉన్న వాటికి సెక్షన్ 54ఈసీ ప్రయోజనాలను విస్తరించాలని యాంఫీ విజ్ఞప్తి చేసింది. సెక్షన్ 54ఈసీ ప్రకారం దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలను మార్చుకుంటే కొన్ని షరతులకు లోబడి మూలధన రాబడి పన్నును తగ్గించుకునేలా అవకాశం ఉంది.
రైల్వేల్లో అపార అవకాశాలు
వచ్చే ఐదేళ్లలో 6.7 ట్రిలియన్ పెట్టుబడులు రైల్వేలో అవసరమవుతాయని క్రిసిల్ అంచనా వేస్తోంది. ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు 2017-18 బడ్జెట్లో 1.3-1.4 ట్రిలియన్ నిధులను కేటాయించవచ్చని క్రిసిల్ అభిప్రాయపడింది. నెట్వర్క్లో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గిస్తూ, విస్తరణల కోసం రైల్వే రంగానికి బడ్జెట్లో తగిన మద్దతు లభించవచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ ప్రసాద్ కోపార్కర్ అన్నారు. ఇప్పటికే ఎల్ఐసీ నుంచి రూ. 1.5 ట్రిలియన్ తనఖా రుణాల మేరకు, ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 523 బిలియన్ రుణాల విషయంలో, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీలతో ఒప్పందాలు పూర్తయినట్లు ఆయన చెప్పారు. రైల్వేల విద్యుదీకరణ, ట్రాక్లను డబ్లింగ్ చేసే ప్రాజెక్టుల కోసం ఎల్ఐసీ నుంచి రుణాలుగా తీసుకునే పెట్టుబడులు ఉపయోగించవచ్చని ఊహిస్తున్నారు. నెట్వర్క్ల్లో ఏర్పడిన రద్దీని తగ్గించుకునేందుకు, రోలింగ్ స్టాక్(లోకోమోటివ్, కోచ్లు) తయారీల కోసం మూలధనాన్ని వినియోగించాల్సిందిగా నివేదిక సూచించింది. సాధారణ పౌరులకు రూ. 6 లక్షలకు, సీనియర్ సిటిజిన్లకు రూ. 7.5 లక్షలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) అరుణ్జైట్లీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. అంతే కాకుండా ట్రాన్స్పోర్ట్ అలవెన్సు పరిమితిని పెంచాలని కోరారు.
ఇతర అంశాలు
పెద్ద నోట్ల మార్పిడి తర్వాత ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర సర్కారు బడ్జెట్లో ప్రోత్సాహక చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పన్నులను తగ్గించనుందనే విషయంలో పరిశీలకుల నుంచి ఎక్కువగా అంచనాలు వెలువడుతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిమాండ్ తగ్గిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే బడ్జెట్లో పన్నులను తగ్గించడం వంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని ఎక్కువ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి వాటల్ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రాయితీలు కల్పించాల్సి ఉందని సూచించింది. డిజిటల్ ఆర్థిక లావాదేవీల భద్రతపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. అలాగే వినియోగదారుల సౌకర్యార్ధం క్రెడిట్, డెబిట్ కార్డులు అన్ని చోట్లా పనిచేసేలాగా, వివిధ పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) మాధ్యమాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఏటీఎమ్ల తయారీకి ఉపయోగించే పరికరాలకు దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతే కాకుండా ఏటీఎమ్ యంత్రాల తయారీకి ఇస్తున్న ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపును పొడిగించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.