మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేసేందుకు ఉన్న వివిధ మార్గాలు
ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే మధ్యవర్తి(ఏజెంట్) తప్ప మరో మార్గం లేదు. సాంకేతికత అభివృద్దితో ఎవరి సాయం లేకుండానే మొత్తం ఆన్లైన్ మార్గంలోనే మ్యూచువల్ ఫండ్ ఖాతా తెరవడం, ప
ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే మధ్యవర్తి(ఏజెంట్) తప్ప మరో మార్గం లేదు. సాంకేతికత అభివృద్దితో ఎవరి సాయం లేకుండానే మొత్తం ఆన్లైన్ మార్గంలోనే మ్యూచువల్ ఫండ్ ఖాతా తెరవడం, పెట్టుబడి పెట్టడం, రిడీమ్ చేసుకోవడం వంటివన్నీ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికీ చాలా మంది విద్యావంతులు సైతం ఫారం కూడా పూర్తిచేయకుండా ఏజెంటుతోనే మొత్తం కానిచ్చేస్తున్నారు. ఏజెంటు ద్వారా ఈ రకమైన పెట్టుబడులు పెట్టడం సంప్రదాయమైన పద్దతి. ఇలా కాకుండా మ్యూచువల్ పండ్స్ పెట్టుబడికి ఉన్న వివిధ మార్గాలను గురించి తెలుసుకుందాం.
1 ఇప్పటికీ ఏజెంట్లనే...
మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలుకు ప్రారంభం నుంచి ఎక్కువ మంది మొగ్గు చూపే మార్గం ఏజెంటు ద్వారా. ఏజెంట్ కు కాల్ చేయడమే ఆలస్యం ఇంటికే వచ్చేస్తున్నారు. ఫారంలన్నీ అతనే పూరించి, చెక్ లేదా డీడీ, అవసరమైన పత్రాలు తీసుకుని వెళ్లిపోతాడు. మీరు సంతకాలు చేస్తే చాలు. అతడికి కంపెనీ కమీషన్ చెల్లిస్తుంది కాబట్టే అతడు ఇదంతా చేస్తున్నాడనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కొంత కాలం పాటు అలా చేసిన వ్యవహారాలను గమనిస్తే ఇన్సూరెన్స్ ఏజెంట్ కంటే మ్యూచువల్ ఫండ్ ఏజెంటుకే ఎక్కువ కమీషన్ లభిస్తుంది. మీకు తెలియకుండానే మీ పెట్టుబడిలో ఏజెంటుకు కొంత కమీషన్ రూపంలో వెళుతుంది.
కానీ అసలు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియని వారికి మరో దారి లేక ఈ రకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. పథకం ఎంపికలో సరైన సలహాలు ఇచ్చే ఏజెంటు అయితే ఆందోళన లేకుండా అతడి ద్వారానే కొనుగోలు చేయడం మంచిది. కొత్తగా పెట్టుబడులు ప్రారంభించే వారు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏజెంటు లేదా బ్రోకర్ సేవలను పొందడం మంచి నిర్ణయమే. అయితే, ఆ ఏజెంటు కేవలం అప్లికేషన్ పూర్తి చేయించుకుని అన్ని పత్రాలను కంపెనీకి సమర్పించే పని మాత్రమే చేస్తే మీకు ఉపయోగం లేనట్టే. అన్ని పథకాల గురించిన సమాచారం తెలుసుకున్న ఏజెంటు అయి ఉంటే మంచి సేవలు అందించగలడు.
2.ఏఎమ్సీ వెబ్సైట్లు
మ్యూచువల్ ఫండ్స్ ను నిర్వహించే కంపెనీలను అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీ (ఏఎమ్సీ)లు అంటారు. ప్రతీ ఏఎమ్సీ కూడా తన వెబ్ సైట్ ద్వారా పథకాల్లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోంది. ఈ రకమైన సేవలు దాదాపు అన్ని వెబ్సైట్లలో ఉచితమే. అయితే, మొదటి సారి ఓ ఏఎమ్సీకి చెందిన మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీ కార్యాలయం లేదా కలెక్షన్ సెంటర్ కు వెళ్లి దరఖాస్తును సమర్పించాలి. దాంతోపాటు కేవైసీ పత్రాలు, చెక్, పాన్ కార్డు కాపీ తదితర పత్రాలను సమర్పించాలి. ఆ తర్వాత ఫోలియే నంబర్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ జారీ చేస్తారు. ఆ తర్వాత నెలనెలా ఏఎంసీ వెబ్ సైట్ ద్వారానే పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ కింద ఉదాహరణ కోసం కొన్ని సంస్థల వెబ్సైట్లు చూడండి.
http://www.franklintempletonindia.com/, http://www.hdfcfund.com/, http://www.icicipruamc.com/, http://www.dspblackrock.com/, http://www.birlasunlife.com/
ఈసీఎస్ మ్యాండేట్(ecs mandate) ఇస్తే ప్రతి నెలా బ్యాంకు ఖాతా నుంచి వాయిదా మొత్తాన్ని డెబిట్ చేసుకుంటారు. ఇలా కాకుండా మరో ఏఎంసీ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సదరు సంస్థ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయి కేవైసీ తప్ప అన్నీ పూర్తి చేయాలి. ఇదంతా కొద్ది శ్రమతో కూడిన వ్యవహారమే. పైగా ప్రతీ ఏఎంసీ ఫోలియో నంబర్, పిన్ గుర్తు పెట్టుకోవడం కూడా కష్టమే. మొదటి సారి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నట్లు అయితే, కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనల మేరకు అన్ని రకాల వివరాలు, పత్రాలు అందించాల్సి ఉంటుంది. ఒకసారి ఏదైనా ఏఎమ్సీ సంస్థకు కేవైసీ సమర్పించి ఉంటే ఆ తర్వాత ప్రతీ ఫండ్ హౌస్ వద్ద కేవైసీ నిబంధనలు పూర్తి చేసే శ్రమ తప్పుతుంది.
3.స్వతంత్ర వెబ్ సైట్లు(independent websites)
ఫండ్స్ ఇండియా, జిప్ సిప్, ఫండ్స్ సూపర్ మార్ట్ ఇలా వంటి వెబ్సైట్లు కూడా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఏ ఏఏమ్సీ పథకంలోనయినా ఒకే ఖాతాతో పెట్టుబడులు పెట్టుకునే వీలును ఈ స్వతంత్ర వెబ్సైట్లు కల్పిస్తాయి. దాంతో పాటు పెట్టుబడుల వివరాలన్నీ ఒకే చోట ఉంటాయి. ఏ పథకంలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి, వాటి విలువ ఎంత తదితర వివరాలను వెబ్సైట్లో లాగిన్ అయి సులభంగా తెలుసుకోవచ్చు. కానీ, ఇవి డైరెక్ట్ ప్లాన్స్ కావు. రెగ్యులర్ ప్లాన్స్. అంటే వీటిలో పెట్టే పెట్టుబడులపై మధ్య వర్తిత్వపు కంపెనీలకు ఏఎమ్సీలు కంపెనీలు కొంత కమీషన్ చెల్లిస్తాయి. దీర్ఘకాలంలో అందుకునే ప్రతిఫలంలో డైరెక్ట్ ప్లాన్స్ తో పోలిస్తే రెగ్యులర్ ప్లాన్స్ లో అందుకునే మొత్తం స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. కానీ, పెట్టుబడుల పరంగా ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి.
ఉదాహరణకు ఫండ్స్ ఇండియా(fundsindia.com)లో ఒక్కసారి పెట్టుబడిదారు గా ఆన్ లైన్ లో నమోదు చేసుకుని కేవైసీ, పాన్ కార్డు వివరాలు, పత్రాలు అన్నీ సమర్పించి ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ పథకంలో కావాలంటే ఆ పథకంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేదా తమ ఖాతాలో ఉన్న ఫండ్ యూనిట్లను విక్రయించుకోవచ్చు(రిడీమ్ చేసుకోవచ్చు) . మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మంచి రాబడులను ఇస్తున్న పథకాల గురించి తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ స్వతంత్ర చెల్లింపులు సజావుగా జరిగేందుకు పోర్టళ్లతో ఒప్పందం ఉన్న బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలి. అప్పుడే నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీల నిర్వహణకు వీలవుతుంది. ఫండ్స్ ఇండియా వంటి వెబ్ సైట్లలో ఖాతా ఉంటే కంపెనీల బాండ్లు, ఎఫ్ డీలు, ఎన్ పీ ఎస్, ట్రేడింగ్, డీమ్యాట్ వంటి అన్ని రకాల పెట్టుబడులకు వీలుంది. అంటే ఒకే ఖాతా ద్వారా పెట్టుబడులన్నింటినీ నిర్వహించుకోవచ్చు.
ఆన్లైన్ బ్రోకర్లు
స్టాక్ మార్కెట్లలో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు గాను బ్రోకర్ల దగ్గర ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉన్న వారు మ్యూచువల్ ఫండ్స్ లోనూ పెట్టుబడులు పెట్టే వీలును కల్పిస్తున్నారు. ఐసీఐసీఐ డైరెక్ట్, హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్, షేర్ ఖాన్, జెరోదా, ఇండియా ఇన్ఫోలైన్, ఆదిత్యా బిర్లా మై యూనివర్స్ తదితర కంపెనీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విధానంలోనూ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం సౌకర్యంగానే ఉంటుంది. ఆయా షేర్ బ్రోకర్ల వెబ్ సైట్లలో లాగిన్ అయ్యి స్కీమ్ ను ఎంచుకుని ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఆ మేరకు వివరాలను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ట్రేడింగ్ ఖాతాలో నగదు(డబ్బు) ఉంటే అందులోంచి డెబిట్ అవుతుంది. లేదా బ్యాంకు ఖాతా నుంచి ట్రేడింగ్ ఖాతాకు నగదు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి ఏకమొత్తంలో పెట్టుబడి మాత్రమే కాదు, ప్రతి నెలా ఏదైనా పథకంలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ (సిప్) విధానంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా వీటి ద్వారా ఆ సౌకర్యం ఉంది. ఆయా వెబ్సైట్లలో పెట్టుబడుల విధానం ద్వారా మీరు ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, కమొడిటీలు, స్థిరాస్తి వ్యవహరాలు, ఫారెక్స్ లావాదేవీలు అన్నింటినీ ఒకేచోట చూసుకోవడంతో పాటు నిర్వహణ సైతం సులభంగా చేయవచ్చు.
ఉదాహరణకు ఏంజెల్ బ్రోకింగ్ ఫండ్స్ పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ (http://www.angelbroking.com/) ఏర్పాటు చేసింది. ఇక్కడ ట్రేడింగ్, డీ మ్యాట్ ఖాతా కలిగి ఉన్న వారు ఇందులో సులభంగా లాగిన్ అయ్యి నచ్చిన పథకాన్ని ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టవచ్చు. ఓ పథకంలో సిప్ విధానంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సిప్ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఓ పథకంలో ఆరు నెలలు పెట్టుబడి పెట్టాలనుకున్నారనుకోండి. నెలనెలా ఎంత మొత్తం, ఏ తేదీ, ఎన్ని నెలలు తదితర వివరాలు ఇవ్వాలి. దాంతో నెలనెలా నిర్ణీత తేదీ నాటికి ట్రేడిండ్ ఖాతాలో నగదు నిల్వలు ఉంటే ఆ మేరకు డెబిట్ చేసి సిప్ కు మళ్లిస్తారు. ఎప్పుడైనా సరే నమోదు చేసి ఉన్న సిప్ లను అవసరం కొద్దీ మార్చుకోవచ్చు.
కొనుగోలు చేసిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లన్నీ కూడా డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతాయి. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లన్నీ కూడా డీమ్యాట్ ఖాతా స్టేట్ మెంట్ లో ఒకే చోట చూసుకోవచ్చు. కొన్ని కొనుగోలు, అమ్మకం సమయంలో చార్జీ వసూలు చేస్తుండగా... జెరోదా వంటి సంస్థలు కొనుగోలు సేవను, అమ్మకం సేవను ఉచితంగా అందిస్తున్నాయి. విక్రయించినప్పుడు డీమ్యాట్ ఖాతాలో డెబిట్ చార్జీలు పడతాయి. ఈ చార్జీలు కంపెనీలను బట్టి మారుతుంటాయి. అయితే, ప్రతీ బ్రోకర్ వద్ద అన్ని రకాల ఏఎంసీ పథకాల్లో మదుపు చేసే అవకాశం లేదు.
5. ఎంఎఫ్ యుటిలిటీ(మ్యూచువల్ ఫండ్ యుటిలిటీస్)
మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సంఘం (యాంఫీ) ఏర్పాటు చేసిన వేదిక ఇది. దీని ద్వారా సేవలన్నీ ఉచితమే. ఏ మ్యూచువల్ ఫండ్ పథకంలోనయినా పెట్టుబడి పెట్టవచ్చు. ముందుగా కామన్ అకౌంట్ నంబర్ (క్యాన్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎన్ని పథకాల్లో పెట్టుబడులు అయినా ఒక్క లావాదేవీతో పూర్తి చేసుకోవచ్చు. పే ఈజ్ విధానంలో ఒక్కసారి బ్యాంకు నుంచి డెబిట్ చేసుకునేందుకు సమ్మతి తెలిపితే నెల నెలా ఆటోమేటిక్ గా బ్యాంకు ఖాతా నుంచి నగదు ఎంఎఫ్ యుటిలిటీకి వెళుతుంది. అయితే, ఈ ప్రక్రియ అంత సులువుగా అర్థం కాదు. సేవల విషయంలోనూ పూర్తి భరోసా లేదు. దగ్గర్లో ఎంఎఫ్ కార్యాలయం అందుబాటులో లేకపోవడం, కేవలం కాల్ సెంటర్, కస్టమర్ సర్వీసు సెంటర్ ద్వారానే సేవలు పొందడం అందరికీ వీలయ్యేది కాదు. ఎంఎఫ్ ద్వారా నేరుగా ఏఎంసీల పథకాల్లో పెట్టుబడి పెడుతున్నాం కనుక డైరెక్ట్ ప్లాన్స్ ద్వారా ఎక్కువ రాబడికి అవకాశం ఉంటుంది.
6. మై క్యామ్స్, కార్వీ
ఇవి కూడా అన్ లైన్, యాప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు వీలు కల్పించేవే. ఏఎంసీ, ఇన్వెస్టర్ మధ్య మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తుంటాయి. నిర్వహణ ఎంఎఫ్ యుటిలిటీ వలే ఉంటుంది. రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్స్ లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. పెట్టుబడులు అన్నీ ఒకే ఖాతా ద్వారా జరుగుతాయి. అయితే, అన్ని కంపెనీల ఫండ్స్ అందుబాటులో ఉండకపోవడం ప్రతికూలత. క్యామ్స్ అయితే, అదనగా పోర్ట్ ఫోలియే సేవలు, ఈక్విటీ షేర్లు, బాండ్లు, సేవింగ్స్ స్కీమ్స్, ఇన్సూరెన్స్, కమోడిటీ, రియల్ ఎస్టేట్ సర్వీసులను అందిస్తోంది.
7. బ్యాంకుల ద్వారా
బ్యాంకులు కూడా ఖాతాదారులకు మ్యూచువల్ ఫండ్ సేవలు అందించేందుకు ఆర్బీఐ, సెబీ అనుమతిచ్చాయి. కానీ, అన్ని రకాల కంపెనీల పథకాలను అందించడం లేదు. సేవల విషయంలో బ్యాంకు ద్వారా మ్యూచువల్ ఫండ్ల కొనుగోలు మార్గంలో అసౌకర్యంగా ఉంటుంది. ఫండ్ వివరాలను పూర్తిగా వివరించకుండా ఏదో ఫండ్లను అంటగడతారనే విమర్శలు సైతం ఉన్నాయి.
ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క పథకంలో ఎలా మదుపు చేయాలి?
కొత్త పథకాలను ఫలానా తేదీ నుంచి ప్రారంభించుచున్నట్లు మ్యూచువల్ ఫండ్ లు సాధారణంగా వార్తా పత్రికలలో ప్రకటనల ద్వారా తెలియజేస్తాయి. దరఖాస్తు ఫారాలు మరియు తమకు అవసరమైన సమాచారం పొందేందుకు మదుపరులు మ్యూచువల్ ఫండ్ యొక్క పంపిణీ దారులు మరియు ఫండ్స్ ప్రతినిధులను సంప్రదించవచ్చు. పంపిణీదారులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉంటారు. ఫండ్స్ యొక్క ప్రతినిధులు పంపిణీదారులు దరఖాస్తు ఫారాలనందించే సేవలు చేస్తారు. వారి వద్ద మదుపరులు దరఖాస్తు ఫారాల ద్వారా సొమ్ము జమ (డిపాజిట్) చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్లను ప్రస్తుతం తపాలా కార్యాలయాలు, బ్యాంకులు కూడా పంపిణీ చేస్తున్నాయి. అయితే తపాలా కార్యాలయాలు, బ్యాంకులు అందించే ఈ సేవలను మదుపరులు బ్యాంకులు, తపాలా కార్యాలయాల యొక్క స్వంత పథకాలుగా భావించరాదు. అందుచేత ఈ పథకాలపై వచ్చే లాభాలు (returns) బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఇస్తాయన్న హామీ ఆ సంస్థల నుంచి పొందుతాయనుకోరాదు. మదుపరులకు మ్యూచువల్ ఫండ్స్ యొక్క పథకాలను పంపిణీ చేసేందుకు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు సహాయం చేయడం వరకే వారి పని అని గ్రహించాలి.
ఒక ప్రత్యేక పథకంలో మదుపు చేసేందు కోసం పంపిణీ దారులు / ప్రతినిధులు ఇచ్చే బహుమతులు, కమీషన్లను మదుపరులు తీసుకొనరాదు. మ్యూచువల్ ఫండ్స్ యొక్క పనితీరును పరిగణనలోకి తీసుకుని వాటి నిర్ణయాత్మక ఉద్దేశాలను మాత్రమే మదుపరులు గమనించాలి.