మీరు బిల్లు చెల్లింపులను చేసేందుకు పనికొచ్చే వ్యాలెట్లు
పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడంతో చెల్లింపుల విషయంలో ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో దాదాపుగా చాలా బిల్లు చెల్లింపులను పూర్త
పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడంతో చెల్లింపుల విషయంలో ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో దాదాపుగా చాలా బిల్లు చెల్లింపులను పూర్తిచేయవచ్చు. దీంతో పాటు కార్డు చెల్లింపుల్లో అంత ఇష్టత చూపనివారు వ్యాలెట్లు ఉపయోగించవచ్చు. కేంద్రం నిర్ణయం ప్రకటించిన మూడు, నాలుగు రోజుల్లోనే పేటీఎమ్కు ట్రాఫిక్ 435% పెరగడంతో పాటు, వ్యాలెట్ డౌన్లోడ్లు 200% పెరిగాయి. అదే విధంగా ఫ్రీచార్జ్ వ్యాలెట్ బ్యాలెన్స్ల మొత్తం 12 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రముఖ మొబైల్ వ్యాలెట్ల గురించి తెలుసుకుందాం.
పేటీఎమ్
దేశంలోనే అత్యధికంగా వినియోగంలో ఉన్న మొబైల్ వ్యాలెట్ పేటీఎమ్. ఎలాంటి బిల్లులైనా ఈ మొబైల్ యాప్ ద్వారా చెల్లించడం సులభం. వినియోగదారులు తమ పేటీఎం అకౌంట్లో డబ్బుల్ని నిల్వచేసుకొని, వాటిని వేర్వేరు అవసరాలకు వినియోగించుకోవచ్చు. మొబైల్ రీచార్జీలు, బిల్లు చెల్లింపులతో మొదలైన ఈ సంస్థ ఆన్లైన్ చెల్లింపుల్లో విస్మరించలేని బృహత్తర మాధ్యమంగా తయారైంది.
సినిమాలు, వేడుకలు, విద్యుత్, టెలిఫోన్, నీటి బిల్లుల చెల్లింపులు, హోటల్స్ వంటి చోట్ల పేటీఎంని వినియోగించుకోవచ్చు. బస్సు, రైలు ప్రయాణ టిక్కట్లతో పాటు విమాన టిక్కెట్లను సైతం ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.చాలా రకాల వస్తువులను పేటీఎమ్ నుంచి కొనుగోలు చేసుకోచ్చు. ప్రస్తుత సందర్భంలో పేటీఎం సేవలు సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడతాయి. PAYTM.COM నుంచి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్వల్పకాలంలోనే పేటీఎమ్ 14 కోట్ల రిజిస్టర్డ్ యూజర్లను సంపాదించగలిగింది. దాదాపు పేటీఎమ్ ద్వారా 7 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి.
ఫ్రీచార్జ్
2 కోట్లకు పైబడి వినియోగదారులతో దూసుకెళుతున్న మరో మొబైల్ వ్యాలెట్ ఫ్రీచార్జ్(www.freecharge.in). 2010లో దీన్ని స్థాపించారు. ఫ్రీచార్జ్ సంస్థను ఇటీవలే స్నాప్డీల్ కొనేసింది. స్నాప్డీల్లో ఫ్రీచార్జ్ ద్వారా పేమెంట్ చేసి వస్తువులను కొంటే అప్పుడప్పుడు క్యాష్బ్యాక్ ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ఈ వ్యాలెట్ అందిస్తున్న సేవల్లో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జీ, డీటీహెచ్ రీచార్జ్, గ్యాస్ బిల్లు చెల్లింపు, మెట్రో స్మార్ట్ కార్డ్ రీచార్జీ, విద్యుత్ బిల్లు చెల్లింపు, ల్యాండ్ లైన్ బిల్లు పేమెంట్ వంటివి కొన్ని ప్రధానమైనవి.
ఫ్రీచార్జీ ఎన్నో ఫుడ్ చెయిన్స్తో, రిటైలర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో మెక్డొనాల్డ్, కేఎఫ్సీ, పీటర్ ఇంగ్లాండ్ వంటివి ముఖ్యమైనవి.
మొబిక్విక్
మొబిక్విక్ 2009లో ప్రారంభమైంది. పీవీఆర్ సినిమాస్తో సినిమా టిక్కెట్ల చెల్లింపులను వ్యాలెట్ ద్వారా చేసేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2014లో మొబైల్ వ్యాపారంలో మొబిక్విక్ ఎమ్బిలియంత్ సౌత్ ఏసియా అవార్డును గెలుచుకుంది. ఈ పేమెంట్ వ్యాలెట్ను సైతం 2 కోట్ల మందికి పైగా వాడుతున్నారు. దాదాపు 70 వేలకు పైగా రిటైలర్స్ ఈ యాప్ ద్వారా సేవలందిస్తున్నాయి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి MOBIKWIKని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబిక్విక్ వ్యాలెట్ బుక్మైషో, మేక్మైట్రిప్, డోమినోస్ పిజ్జా, ఈబే వంటి వ్యాపార సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకొంది.
ఆక్సిజన్ మొబైల్ వ్యాలెట్
ఆక్సిజన్ మొబైల్ వ్యాలెట్ 2004లో ప్రారంభమైంది. ఇందులో వెంటనే రీచార్జీలు, బిల్లు చెల్లింపులు చేసుకోవడంతో పాటు పాయింట్ ఆఫ్ సేల్స్ ద్వారా నగదు బదిలీలను సైతం చేసుకోవచ్చు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 5 లక్షల రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. ఆక్సిజన్ వ్యాలెట్ సైతం 2 కోట్ల యూజర్లను కలిగి ఉంది. అన్ని రకాల డివైజ్ల్లో కలిపి 1.50 కోటికి పైగా డౌన్లోడ్లను పొందగలిగింది. దీని ద్వారా 15 వేల వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు.
citruspay.com
లక్షలాది మంది వినియోగదారులు సిట్రస్ మొబైల్ పేమెంట్ సర్వీస్ని వినియోగించుకుంటున్నారు. మనీ ట్రాన్స్ఫర్తో పాటు షాపింగ్ కూడా ఈ యాప్ ద్వారా చాలా సులభం. కేవలం ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్న సంస్థలతోనే కాదు.. ఆఫ్లైన్ సంస్థలతోనూ సిట్రస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. 50 వేలకు పైగా ప్రైవేటు సంస్థల్లో సిట్రస్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. ట్రావెల్, కిరాణా షాపుల్లోనూ సిట్రస్ యాప్ని వినియోగించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి Citrusని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ సేవల్లో గ్లోబల్ ప్లేయర్గా ఉన్న పేయూ, అదే రంగంలోని దేశీయ కంపెనీ సిట్రస్ పేను కొనుగోలు చేసింది. 870 కోట్ల రూపాయలకు ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.
ఎయిర్టెల్ మనీ
ఎయిర్టెల్ మనీ సెమీ క్లోజ్డ్ వ్యాలెట్. ఇది నగదును విత్డ్రాచేసుకునేందుకు లేదా వెనక్కు తీసుకునేందుకు అనుమతించదు. దీని ద్వారా రీచార్జీ చేసుకోవచ్చు. మొబైల్లో ఉండే కాంటాక్ట్ నంబర్లకు డబ్బును బదిలీ చేయవచ్చు. అదే విధంగా షాపుల్లో చెల్లింపులు చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలకు డబ్బును పంపుకోవచ్చు. అంతే కాకుండా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
వోడాఫోన్ ఎమ్పెసా
85వేల మంది ఎమ్పెసా ఏజెంట్లతో దేశంలో అతిపెద్ద క్యాష్అవుట్ నెట్వర్క్గా వోడాఫోన్ ఎమ్పెసా చెబుతోంది. ఈ అవుట్లెట్ల(ఏజెంట్ల) వద్ద నుంచి ఎక్కడికైనా(బ్యాంకు ఖాతా ద్వారా) డబ్బు పంపవచ్చు. ప్రీపెయిడ్,డీటీహెచ్ రీచార్జీలు పూర్తిచేసుకోవచ్చు. యుటిలిటీ బిల్లులు చెల్లించడంతో పాటు ఆన్లైన్ షాపింగ్ కోసం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. బ్యాంకు ఖాతాకు రూ. 2000 పంపేందుకు మీకు రూ. 38 ఖర్చవుతుంది. బ్యాంకు ఖాతాలు లేనివారికి డబ్బు పంపాలంటే ఎమ్పెసా మంచి చాయిస్.
ఈ-కామర్స్ చెల్లింపులు
అన్ని వర్గాల ప్రజలను ప్రస్తుతం ఎక్కువగా ఆకర్షిస్తున్న పదం మొబైల్ వ్యాలెట్. విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఈ-కామర్స్ చెల్లింపులు అంటే గత మూడేళ్ల క్రితం వరకూ డెబిట్, క్రెడిట్ కార్డులే గుర్తొచ్చేవి. మొబైల్ వ్యాలెట్ల రాకతో అన్ని ఆర్థిక లావాదేవీలు ఒకేచోట నుంచే చేసే సౌలభ్యం ఏర్పడింది. మొబైల్ రీచార్జీ మొదలుకొని విమాన ప్రయాణ టిక్కెట్ల వరకూ అయ్యే చెల్లింపులన్నీ నిమిషాల వ్యవధిలో జరగుతుండటంతో యువతరం వీటివైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో సమయం ఆదా అవడంతో పాటు శ్రమ తగ్గుతోంది. క్యాష్ బ్యాక్లు ఉండటం అదనపు ప్రయోజనం.
వ్యాలెట్ అంటే ఏమిటి? వ్యాలెట్ ద్వారా ప్రయోజనాలేంటి?