ఒకటికి మించి బ్యాంక్ ఖాతాలు లాభమా, నష్టమా?
దేశంలోని అందరూ బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ 'జన్ధన్ యోజన' పథకం ప్రారంభించిన తర్వాత దేశంలో బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తులు లేరంటే అతిశయోక్తి కాదు. చాలా మందికి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వారికి నాలుగైదు బ్యాంకుల్లో ఖాతాలను కలిగి ఉంటున్నారు.
అనేక ఖాతాలను కలిగి ఉండటం వల్ల వీటిలో ఏదో ఒక బ్యాంక అకౌంట్నే ఉపయోగిస్తూ మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు ఆ బ్యాంక్ ఖాతా ఉపయోగించాల్సి వస్తే ‘మీ ఖాతా చాలా కాలంగా ఆపరేట్ చేయడం లేదని పక్కన పెట్టాం. దాన్ని పునరుద్ధరించాలంటే ప్రత్యేక ఫీజు చెల్లించాల్సిందే'నని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తుంటారు.
ఈ ఫీజులు కొద్ది మొత్తంలో ఉన్నా, మీ జేబుకు మాత్రం చిల్లు పడుతుంది. ఇలా రెండోసారి జరగక్కుండా ఉండాలంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరి. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటంటే....
కనీస నగదు బ్యాలెన్స్
బ్యాంకులో ఖాతా తెరిచాక ఆ ఖాతాలో బ్యాంకు ఆదేశాల ప్రకారం కనీస నగదు బ్యాలెన్స్ చేయడం ఎంతో ఉత్తమం. ఈ కనీస బ్యాలెన్స్ ఎంత? అనేది బ్యాంకును బట్టి మారుతుంటుంది. ప్రతి బ్యాంక్ వెబ్సైట్లో లేదా ఖాతా ప్రారంభించేందుకు సంబంధించిన దరఖాస్తులో ఈ వివరాలు ఉంటాయి.
జరిమానా
బ్యాంకు నిర్దేశించిన విధంగా నెలసరి లేదా త్రైమాసిక కనీస సగటు నగదు నిల్వలు మీ ఖాతాలో లేకపోతే, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కనీస నగదు నిల్వ మళ్లీ నగరాలు, పట్టణాలను బట్టి మారుతుంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంకులనే తీసుకుంటే మెట్రో నగరాలు, ఇతర ప్రధాన నగరాల బ్రాంచ్ల్లో అయితే నెలకు కనీసం రూ.10,000 మినిమం బ్యాలెన్స్ . చిన్న పట్టణాల్లో రూ.5,000, గ్రామీణ బ్రాంచ్ల్లో అయితే రూ.2,000 ఉంటే సరిపోతుంది.
ఎటిఎంల వినియోగం
నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ చెకింగ్ కోసం చీటికి మాటికి మీరు ఎటిఎంల మీదే ఆధారపడుతున్నారా? అయితే మీ జేబుకు చిల్లు పడినట్టే. ఆర్బిఐ నిబంధనల ప్రకారం మీ బ్యాంక్ ఎటిఎం నుంచి నెలకు ఐదు ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతిస్తారు. మీరు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉంటుంటే ఇతర బ్యాంకుల ఎటిఎంల నుంచి మరో మూడు ఉచిత లావాదేవీలు అనుమతిస్తారు. అంతకు మించితే మాత్రం ప్రతి నగదు లావాదేవీపై రూ. 20 చొప్పున, నగదేతర లావాదేవీపై రూ.5 చొప్పున బ్యాంక్కు జరిమానాగా చెల్లించాలి.
లావాదేవీల వివరాలు
నెట్ బ్యాంకింగ్ ద్వారా స్టేట్మెంట్లు తీసుకోవడంతో పాటు, గత లావాదేవీల వివరాలు కూడా తీసుకోవచ్చు. అయినా ఇప్పటికీ చాలా మంది డూప్లికేట్ స్టేట్మెంట్ల కోసం బ్యాంక్ బ్రాంచ్లకు వెళుతుంటారు. మీ ఖాతాల్లో ఎంత నగదు ఉన్నా, బ్యాంకులు డూప్లికేట్ స్టేట్మెంట్ల కోసం డబ్బును వసూలు చేస్తుంటాయి. ఒక్కో డూప్లికేట్ స్టేట్మెంట్కు రూ.100 వరకు వసూలు చేస్తాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారానే మన ఖాతా స్టేట్మెంట్ తీసుకుంటే ఈ ఖర్చులు తగ్గించుకోవచ్చు.